అమెరికా గురుద్వార వద్ద కాల్పులు, ఏడుగురు మృతి
స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం పదకొండుగంటల సమయంలో ఈ దారుణం జరిగినట్టు స్థానిక పత్రిక మిల్వాకీ సెంటినల్ తెలిపింది. స్లీవ్లెస్ టీషర్టు ధరించి, బట్టతలతో ఉన్న భారీకాయుడు ఒకడు రెండు హ్యాండ్గన్స్తో ఈ కాల్పులు జరిపాడని ప్రత్యక్షసాక్షులు తెలిపినట్టు తన కథనంలో పేర్కొంది. విషయం తెలిసిన వెంటనే ఒక పోలీసు అక్కడికి చేరుకుని కాల్పులు జరుపుతున్న అగంతుకుడితో తలపడ్డారని, పలు బుల్లెట్ గాయాలైనా లెక్కచేయక ముష్కరుణ్ని మట్టికరిపించగలిగారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు స్థానిక ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరో ఇద్దరు దుండగులు 20 మందిని బందీలుగా పట్టుకుని గురుద్వారాలో దాగి ఉన్నారని మిల్వాకీ సెంటినల్ పత్రిక చెబుతోంది. అందులో 12 మంది పిల్లలేనని సమాచారం. కాగా, గురుద్వారా ప్రధాన పురోహితుడు లోపలే ఒక గదిలో తలుపులు వేసుకుని ఉన్నట్టు స్థానిక మీడియా చెబుతోంది.
ఆయన వద్ద ఒక సెల్ఫోన్ కూడా ఉంది. ఆదివారం గురుద్వారాలో ప్రసంగించేందుకు భారతదేశం నుంచి ప్రత్యేకంగా ఒక గురువు వచ్చారని, 300-400 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని సమాచారం. గురుద్వారా అధ్యక్షుడు కూడా ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.