టెక్కీ నీలిమ మృతి ఇంకా పజిలే, అనుమానాస్పదమే
శరీర పరీక్షలో ఏమైనా మరిచిపోయామో మరోసారి చూడడానికి పోస్టుమార్టం సిడి తమకు కావాలని, నేరం జరిగిన స్థలంలోని చిత్రాలు కావాలని అడిగినట్లు నీలిమ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన గాంధీ ఆస్పత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి. విక్రమాదిత్య చెప్పినట్లు మంగళవారం వార్తలు వచ్చాయి. నేరం జరిగిన స్థలంలోని చిత్రాలను, నీలిమ గాయాలను బట్టి వైద్యులు పోస్టుమార్టం రిపోర్టును తయారు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
నీలిమ మృతిపై ఓ నిర్ధారణకు రావడానికి వారం రోజులు పడుతుందని డిసిపి యోగానంద్ అంటున్నారు. పోస్టుమార్టం రిపోర్డుపై ఓ నిర్ణయానికి రావడం సరైంది కాదని, నేరం జరిగిన స్థలంలోనే క్లూస్ దొరుకుతాయని ఫోరెన్సిక్ నిపుణులు అంటున్నారు. ఆత్మహత్య అయి ఉంటే భవనానికి దూరంగా మృతదేహం పడి ఉండేదని అంటున్నారు. అయితే, పడుతున్నప్పుడు గోడకు తాకడం వల్ల మృతదేహం భవనానికి సమీపంలో పడి ఉండవచ్చుననే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
నీలిమ శరీరానికి పైభాగంలో ఎక్కువ గాయాలు కనిపిస్తున్నాయని, పైనుంచి పడి ఉంటే కాళ్లకు, శరీరం కింది భాగాలకు ఎక్కువ గాయాలు కావాల్సి ఉండాలని, అయితే లోపల ఫ్రాక్చర్స్ ఉన్నాయేమో తెలియదని అంటున్నారు. ఆమె శరీరానికి తగిలిన గాయాల గురించి ఎవరూ పెద్దగా మాట్లాడడం లేదు. అయితే, ఇన్ఫోసిస్ కార్యాలయానికి కేవలం ఆత్మహత్య చేసుకోవడానికే నీలిమ వెళ్లిందా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.