ఇంటి నుంచి గెంటి వేశారు: ఎన్నారై భార్య యామిని
కాగా తనను ఇంట్లోకి రానీయడం లేదని యామిని అనే ఎన్నారై భార్య తన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి ఆమె హైదరాబాదులోని గాంధీనగర్లో తన అత్తారింటి ముందు ధర్నా చేస్తోంది. ఆస్ట్రేలియాలో వైద్య వృత్తి చేస్తున్న యామిని అనే మహిళ తన కుమారుడితో పాటు తన భర్త కార్తిక్ ఇంటి ముందు ఆందోళన చేస్తోంది. ఆమె ధర్నాతో అత్తారింటివారు ఇంటికి తాళం వేసి వేరే చోటికి వెళ్లిపోయారు.
తెలిసిన వివరాల ప్రకారం - 2000లో యామిని వైద్య విద్య అభ్యసించడానికి ఆస్ట్రేలియా వెళ్లింది. వైద్య విద్య ముగిసిన తర్వాత వైద్య వృత్తి చేస్తూ ఆమె అక్కడే స్థిరపడింది. 2009లో ఓ మ్యారేజీ బ్యూరో ద్వారా కార్తిక్తో ఆమెకు వివాహమైంది. వారికి ఓ కుమారుడు కూడా కలిగాడు. ఆస్తిని తన పేరు మీద రాయాలని భర్త తనపై ఒత్తిడి చేస్తున్నాడని యామిని ఆరోపిస్తోంది.
ఆస్తిని బదిలీ చేయడానికి నిరాకరించడంతో తన భర్తతో పాటు కుటుంబ సభ్యులు హైదరాబాదు వచ్చేశారని, తిరిగి రాకపోవడంతో తాను కూడా హైదరాబాదు రావాల్సి వచ్చిందని యామిని ఓ టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పింది. తాను తిరిగి ఆస్ట్రేలియా వెళ్లబోనని, ఇక్కడే ఉంటూ కాపురం చేసుకుంటానని చెప్పినా తన అత్తింటివారు అంగీకరించడం లేదని ఆమె చెప్పింది.
యామిని ఆస్ట్రేలియాలో పెద్ద యెత్తున ఆస్తి సంపాదించినట్లు, భారత కరెన్సీలో అది వందల కోట్లు ఉంటుందని అంటున్నారు. దీంతో భర్తతో పాటు అత్తింటివారు ఆ ఆస్తిపై కన్నేశారని, ఆ ఆస్తి తమ పేరు మీద రాస్తేనే ఉంటామని చెబుతున్నారని యామిని చెబుతున్నట్లు మీడియా కథనాలు వస్తున్నాయి.