ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య: మంత్రితో కలిసున్న ఫొటోలు
గీతికా శర్మ కందాకు ఉద్యోగిని మాత్రమే కాదని, వారిద్దరు వ్యక్తిగత సంబంధాలను కూడా సాగించారని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. అయితే, ఆ ఆరోపణలను కందా ఖండిస్తున్నారు. తాను నడిపే ఎండిఎల్ఆర్ మాజీ ఉద్యోగి మాత్రమేనని, గీతికతో తనకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన అంటున్నారు.
గీతిక, కందా కలిసి షిర్డీ, ముంబై వంటి పలు ప్రదేశాలను సందర్శించినట్లు ఆమె కుటుంబ సభ్యులు విడుదల చేసిన ఫొటోలు తెలియజేస్తున్నాయి. కందా చేసిన ఫొన్లు గీతికకు ప్రశాంతత లేకుండా చేశాయని, దాంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని గీతిక కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇటీవలి కాలంలో తాను గీతికకు ఫోన్ చేయలేదని, కావాలంటే తన ఫోన్ కాల్స్ను పరిశీలించుకోవచ్చునని కందా అంటున్నారు. గీతిక చదువు కోసం తాను అప్పుగానే ఇచ్చానని ఆయన చెప్పారు.
గీతిక అత్యంత సన్నిహితంగా ఉండడం వల్లనే కందా ఎంబిఎ చదవడానికి ఏడు లక్షల రూపాయలు ఇచ్చాడని గీతిక కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గీతికకు కందా బిఎండబ్ల్యు ఇచ్చారని, అయితే కొన్నాళ్లు వాడుకుని గీతిక తిరిగి ఇచ్చేసిందని అంటున్నారు. పై చదువుల కోసం తాను గీతికకు ఏడున్నర లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా సిర్సాలో నడిచే తన అంతర్జాతీయ స్కూల్ ట్రస్టు చైర్మన్గా కూడా చేశానని కందా అంటున్నారు. ఆ తర్వాత ఆమెతో తనకు సంబంధాలు లేవని చెబుతున్నారు.
కొత్త పరిణామం గీతిక మృతి కేసు దర్యాప్తులో పోలీసులకు ఉపయోగపడవచ్చునని భావిస్తున్నారు. పోలీసులు గీతిక ల్యాప్టాప్ను, మొబైల్ ఫోన్లను దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఫ్లాట్లో కందా, గీతికలకు సంబంధించిన కొన్ని ఫొటోలు లభించినట్లు పోలీసులు చెబుతున్నారు.
గీతికా శర్మ ఆత్మహత్యతో హర్యానా హోంశాఖ సహాయ మంత్రి గోపాల్ కందా ఆదివారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గతంలో ఆయన నిర్వహించిన విమానయాన సంస్థలో ఎయిర్ హోస్టెస్గా పని చేసిన ఇరవై మూడేళ్ల గీతికా శర్మ శనివారం రాత్రి ఢిల్లీలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గోపాల్ మానసిక వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె లేఖ రాసింది.