శ్రీరాములు అరెస్ట్పై పుకార్లు: గాలి వర్గంలో ఆందోళన
సురేష్బాబుతో ఏసిబి పోలీసులు బలవంతంగా ఇలా శ్రీరాములు పేరు చెప్పించి ఉండవచ్చునని బళ్ళారి ఎంపి శాంత పేర్కొనడం గమనార్హం. మొత్తానికి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సీనియర్ నేతలు జైలు పాలు కావడంతో బళ్ళారిలోని గాలి మద్దతుదారుల్లో ఆందోళన ప్రారంభమైంది. గాలి జనార్దన్ రెడ్డి జైల్లో ఉన్నప్పటికీ ఆయన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సోమశేఖర్ రెడ్డి, సురేష్ బాబు కూడా అదేబాట పట్టడంతో వీరి ఆందోళన మరింతగా పెరిగింది. మమ్మల్ని టార్గెట్ చేశారని, ఎసిబికి గత నాలుగు రోజులుగా ఇంటరాగేషన్ సమయంలో కోరిన సమచారం అందిస్తూ వచ్చానని, అయినప్పటికీ సోమవారం తనను హఠాత్తుగా అరెస్టు చేసి జైలుకు పంపడం అన్యాయమని సోమశేఖర్రెడ్డి వాపోయారు.
ఫోన్లో ఆయన బెంగళూరుకు చెందిన పలువురు పాత్రికేయులతో మాట్లాడారు. వరుస పెట్టి మమ్మల్నందర్నీ అరెస్టు చేసి జైలుకు పంపుతున్న వైనం గమనిస్తుంటే దీని వెనుక భారీ కుట్ర ఉన్నట్లు అనిపిస్తోందని చెప్పారట. తమకు న్యాయస్థానాలపై అపార గౌరవముందని పేర్కొన్నారు. జైల్లో పెట్టి తమ అత్మస్థైర్యాన్ని దెబ్బతీయజాలరని వ్యాఖ్యానించారు. కాగా బెయిల్ కోసం డీల్ వ్యవహారంలో సోమశేఖర్ రెడ్డి అరెస్టు కావడంతో ఆయనకు పదవీగండం ఏర్పడిందని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర పాల సమాఖ్య అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సోమశేఖర్ రెడ్డిని తొలగించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.
పార్టీ అధిష్ఠానం పెద్దలతో చర్చించి దీనిపై అంతిమ నిర్ణయం తీసుకుంటానని జగదీష్ శెట్టర్ హుబ్లీలో సోమవారం ప్రకటించారు. గాలి సోమశేఖర్ రెడ్డి అరెస్టుపై ఆయన వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. చట్టం తన పని తాను చేస్తోందని తాము జోక్యం చేసుకోబోమన్నారు. తమ శిబిరానికి చెందిన నేతలు ఒక్కొక్కరే జైలు పాలవుతుండటంతో గాలి శిబిరంలో విషాదం నెలకొని ఉంది. రానున్న రోజుల్లో మరింకెన్ని పరిణామాలు సంభవిస్తాయోనని ఈ శిబిరం భయాందోళన చెందుతోంది. తాజాగా సోమశేఖర్ రెడ్డి అరెస్టు కావడం, మాజీ మంత్రి శ్రీరాములు అరెస్టు అయ్యే అవకాశం ఉన్నట్లు వదంతులు వ్యాపించడంతో గాలి శిబిరానికి చెందిన లోకసభ సభ్యులు జె.శాంత, సణ్ణఫక్కీరప్ప త్వరలో ఢిల్లీకి వెళ్ళాలని నిశ్చయించారు.