ఇనప్పెట్టె తాళాలు స్త్రీల వద్దే: ఇందిరమ్మ బాటలో సిఎం
ఏడాదిలో లక్షా 16 వేల ఉద్యోగాలు ఇచ్చామని ఆయన చెప్పారు. వరి పంట ఉత్పాదక వ్యయం బాగా పెరిగిందని, వ్యయానికి తగినట్లు ప్రతిఫలం రావడం లేదని ఆయన అన్నారు. 29 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేస్తామని, క్వింటాలుకు 1500 రూపాయల ధరతో కొనుగోలు చేస్తామని ఆయన చెప్పారు. రైతు భవిష్యత్తు బాగుండాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని ఆయన అంతకు ముందు అన్నారు. రైతులకోసం, రైతు కూలీలకోసం తమ ప్రభుత్వం నిరంతరం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నదని ఆయన చెప్పారు.
రైతులు పండించే ధాన్యానికి మద్దతుధర సరిపోవడంలేదని వాటిని పెంచడానికి తగు యత్నాలు చేశామని ఆయన కృషి చేశారు. 1999 నుంచి 2004 వరకు కేవలం 70 రూపాయలు మాత్రమే కేంద్రం మద్దతు ధరను పెంచిందని, ఇప్పుడు ఆ మొత్తాన్ని క్వింటాలుకు రూ. 1280 వరకు పెంచగలిగామని ఆయన చెప్పారు. ఎరువుల రేట్లు పెరిగాయని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే రైతులపై భారాన్ని తగ్గించే దిశగా కృషి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి వివరించారు.
మహిళల అభ్యున్నతికోసం కూడా తమ ప్రభుత్వం అవిరళ కృషి చేస్తున్నదని కిరణ్ కుమార్ చెప్పారు. మీరు అసలు కడితే చాలు, వడ్డీ తామే కడతామని ఆయన పునరుద్ఘాటించారు. ప్రభుత్వం రూ. 13,000 కోట్లు బ్యాంకర్లనుంచి తీసుకుని మహిళలకు ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఇది దేశం మొత్తం మీద ఎంత రుణంగా తీసుకుంటున్నారో అందులో సగ భాగం మన మహిళలే రుణాలుగా తీసుకుంటున్నారని ఆయన చెప్పారు.
స్త్రీ నిధి గురించి చెబుతూ మహిళలు రెండవ సారి కూడా బయటకు వెళ్లి అప్పు తీసుకుంటున్నారని తన దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. అందుకే మీ ద్వారానే బ్యాంకు పెట్టించి 1500 కోట్ల పెట్టుబడితో కేవలం 48 గంటల్లోనే మహిళలకు రుణం వచ్చే ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.