ఇంజనీరింగ్ కాలేజీలకు కళ్లెం: గవర్నర్ ఆర్డినెన్స్
తొమ్మిది నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా అంతకు ముందటి చట్టాన్ని సవరిస్తూ కొత్త చట్టాన్ని రూపొందించినట్లు సమాచారం. ఇంజనీరింగ్ కళాశాలలను కట్టడి చేసేందుకే ఈ చట్టాన్ని తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పాత చట్టాల వల్ల వృత్తి విద్యా కశాశాలలపై ప్రభుత్వ నియంత్రణకు అంతగా అధికారాలు లేవు. నియంత్రణ కోసం ఈ ఆర్డినెన్స్ను తెచ్చారని అంటున్నారు.
రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ కళాశాలల్లో తగిన మౌలిక వసతులు లేవని, అయినా ఫీజులు మాత్రం వసూలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పైగా, కాలేజీలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. విద్యార్థుల కొరతతో చాలా కాలేజీల్లో సీట్లు కూడా మిగిలిపోతున్నాయి. వృత్తి విద్యాసంస్థలను కట్టడి చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించినట్లు చెబుతున్నారు.
ఫీజులు పెంపునకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. మెరిట్ కోటా సీట్లకు, యాజమాన్యం కోటా సీట్లకు వేర్వేరు ఫీజులు ఉండడాన్ని యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. మెరిట్ కోటా సీట్లకు కూడా ఫీజు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.