వారి మాటా వినను: టిడిపి, జగన్ పార్టీపై కిరణ్ కుమార్
పాల్వంచలోని ఇందిర బాటలో ఆయన పాల్గొన్నారు. పని చేసే వారి పైన విమర్శలు వస్తూనే ఉంటాయన్నారు. వచ్చే ఏడాది ఆరు లక్షల మందికి ఈ పథకం కింద ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వ రంగంలో 1.60 లక్షలు, ప్రయివేటు రంగంలో 3.60 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. పాలనలో ఏదైనా పొరపాట్లు ఉంటే పట్టించుకోమని చెప్పారు. రాజీవ్ యువకిరణాల ద్వారా యువజనులను సరైన మార్గంలో పెడతామన్నారు. అటవీ ప్రాంతంలోని గిరిజనుల భూములను సెటిల్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా ఉన్నత చదువులు ఆపేయవద్దన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాల వద్ద 104 సర్వీసు ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించే విధంగా చూస్తామని చెప్పారు. పాఠశాలల్లో సదుపాయాలు కల్పిస్తామని, రూ.600 కోట్ల రూపాయలతో గిరిజన పాఠశాలల్లో తరగతి గదులు ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతుండగా సిపిఎం సభ్యులు ఆందోళనకు దిగారు.
వారిపై కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అరుపులకు భయపడే వాడిని కాదని, ఇంకా ఎక్కువగా మీ గ్రామాలకు వస్తానని, అభివృద్ధి చేసి చూపిస్తానని కిరణ్ అన్నారు. బహిరంగ సభలలో గొడవ చేయవద్దన్నారు. ఏమైనా కావారంటే ఆర్డీవోకు వినతి పత్రం ఇవ్వాలని, పరిశీలించి న్యాయమైతే పరిష్కరిస్తాన్నారు. అసెంబ్లీలో ఒక్క స్థానం మాత్రమే ఉందని, ఇలా ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలను అడ్డుకుంటే ఆ ఒక్క సీటు కూడా పోతుందన్నారు.