గాలి జనార్ధన్ రెడ్డి సోదరుడు సోమశేఖర రెడ్డి పదవి సేఫ్
అయితే సోమశేఖర్ రెడ్డి పదవికి ఇప్పట్లో ముంచుకొచ్చే ముప్పేమీ లేదు. కర్ణాటక పాల సమాఖ్య(కెఎంఎఫ్) అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పించరాదని కర్ణాటక సర్కారు నిర్ణయించింది. మంత్రి బిజె పుట్టస్వామి బుధవారం బెంగళూరులో ఆ శాఖ ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. సోమశేఖర్ రెడ్డిని కెఎంఎఫ్ అధ్యక్ష పదవిలో కొనసాగించేందుకు ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు ఉండవన్నారు.
గాలి బెయిల్ వ్యవహారం కేసులో రెండో నిందితుడు, గాలి జనార్ధన్ సోదరుడు అయిన గాలి సోమశేఖర రెడ్డిని ఎసిబి అధికారులు సోమవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతనికి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఎసిబి కోర్టుకు తరలించారు. గాలి బెయిల్ డీల్ కేసులో సోమశేఖర రెడ్డిని ఎసిబి అధికారులు శుక్రవారం నుండి విచారిస్తున్నారు. ఆయన కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్నట్లుగా వార్తలు రావడంతో గత శుక్రవారం ఎసిబి కార్యాలయానికి వివరణ ఇచ్చేందుకు వచ్చారు.
ఆ రోజు నుండి ఎసిబి అధికారులు అతనిని బెయిల్ డీల్ కేసుపై విచారించారు. అయితే అతను మాత్రం ఈ కేసులో తన సోదరుడి బెయిల్ కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని ఎసిబి అధికారుల ముందు చెప్పారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తమ ఎదుట హాజరు కావాలని సోమశేఖర రెడ్డికి ఎసిబి అధికారులు గతంలోనే నోటీసులు జారీ చేశారు. కాగా గాలి బెయిల్ డీల్ కేసులో ఇప్పటికే న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులలతో సహా పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ కేసులో దాదాపు ఇప్పటికే ఎసిబి అధికారులు అందరినీ అరెస్టు చేశారు. ఆఖరుకు మిగిలింది సోమశేఖర రెడ్డి ఒక్కరే. ఇప్పుడు ఆయన అరెస్టు కూడా జరగటంతో అందరి అరెస్టు జరిగినట్లుగా భావించవచ్చు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టైన బ్రహ్మానంద రెడ్డి బెయిల్ పిటిషన్ పైన విచారణను కోర్టు ఈ నెల 14వ తేదికి వాయిదా వేసింది.