జగన్ సాక్షికి దానం వార్నింగ్: మంత్రుల మధ్య చిచ్చు
ఇస్కాన్ అంశంపై దానం తీవ్రంగా స్పందించారు. తాను లక్ష్మీ నరసింహ ఆలయ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నానని ఆరోపిస్తున్నారని, అది సరికాదన్నారు. తాను ఇప్పటి వరకు ఎక్కడా కబ్జాలకు పాల్పడలేదన్నారు. తనపై ఇస్కాన్ వారు కేసులు పెట్టారని, కేసులు తమకు కొత్త కాదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదహారేళ్ల పాటు పోరాటం చేశామన్నారు. సాక్షి పత్రిక వాస్తవాలు తెలుసుకొని కథనాలు రాయాలన్నారు.
కొన్ని పత్రికలు ఇష్టం వచ్చినట్లుగా రాస్తున్నాయని గతంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారని, అలాంటి పత్రికలను చదవ వద్దని కూడా వ్యాఖ్యానించారని, ఇప్పుడు సాక్షి కూడా వైయస్ చెప్పినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా కథనాలు రాస్తోందని, దానిని కూడా చదవవద్దని చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. సాక్షి మీడియా వాళ్లు దయచేసి వాస్తవాలు తెలుసుకొని రాయాలన్నారు. వైయస్ తమ గుండెల్లో ఉన్నారని, ఆయనను ఎవరూ తమ నుండి విడదీలయలేరన్నారు.
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని లీజుకు తీసుకున్న ఇస్కాన్ సంస్థ దొంగ సంస్థ అని ఆరోపించారు. రియల్ ఇస్కాన్ వాళ్లు కూడా ఆ విషయాన్ని చెప్పారన్నారు. తాను ఏది మాట్లాడినా వాస్తవాలు దగ్గర పెట్టుకొని మాట్లాడతానని చెప్పారు. భగవంతుని క్షేత్రాన్ని కాపాడేందుకే తాను పోరాడుతున్నానన్నారు. ఇందులో తన స్వార్థం లేష మాత్రం లేదన్నారు. తనకు కబ్జా అనే దురుద్దేశ్యమే ఉంటే గోడ కట్టించే వాన్ని కాదన్నారు.
ఇస్కాన్ వాళ్ల ప్రవర్తన కూడా ఇక్కడ సరిగా లేదన్నారు. తనపై నిన్నటి నుండి వస్తున్న వార్తలు సరికాదన్నారు. దేవుడి పేరు చెప్పి తాను రాజకీయాలు చేయనని, అలాంటి పరిస్థితి వస్తే తాను రాజకీయాల నుండే తప్పుకుంటానన్నారు. తాను జనం కోసమే తాపత్రయ పడుతున్నానని చెప్పారు. తాను చివరి వరకు కాంగ్రెసు జెండానే మోస్తానని, పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. అందుకోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్నారు.
ఇస్కాన్ వాళ్ల గురించి తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఈ అంశాన్ని ఇప్పటికే తాను పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్యల దృష్టికి తీసుకు వెళ్లానని చెప్పారు. భూములు కాపాడేందుకే తాళం వేశానని, పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారన్నారు. హరేరామ సంస్థ ఖచ్చితంగా బోగస్ సంస్థ అన్నారు.
సబిత పైన మండిపాటు
ఇస్కాన్ - లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ఇష్యూ మంత్రుల మధ్య చిచ్చు పెట్టినట్లుగా కనిపిస్తోంది. దానం హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పైన మండిపడ్డారు. తనపై కేసు పెట్టడాన్ని ఆయన తప్పు పట్టారు. టిడిపి హయాంలో తనపై 190 కేసులు పెట్టారని, ఏం కాలేదని, ప్రజల కోసం కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. తనపై కేసు విషయమై హోంమంత్రి వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆమె నిద్ర పోతుందా అని ప్రశ్నించారు. తాను బిసిని కాబట్టే తనపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని విమర్శించారు. తనపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. కొందరు సిఎంను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఇలా అయితే కాంగ్రెసు నాశనం అవడం ఖాయమన్నారు.
దానంకు షబ్బీర్ అలీ, విహెచ్ మద్దతు
మంత్రి దానం నాగేందర్కు షబ్బీర్ అలీ మద్దతు పలికారు. నాగేందర్ పైన కేసులు సరికాదని, మంత్రిపై పలు సెక్షన్ల క్రింద కేసు పెట్టడం దారుణమన్నారు. ఈ విషయాన్ని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. దానంపై కేసు విచారకరమని వి హనుమంత రావు అన్నారు. కేసుపై ముఖ్యమంత్రి పునరాలోచించాలని సూచించారు. మంత్రిపై కేసు పెడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, ఇస్కాన్కు మరోచోట భూమి కేటాయించాలన్నారు.
ఇస్కాన్ ఆధ్వర్యంలో వేడుకలు
మరోవైపు ఇస్కాన్ ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఇందుకోసం భారీగా పోలీసులను ఆలయం వద్ద మోహరించారు.