జైపాల్ రెడ్డితో కిరణ్ రెడ్డి ఫైట్: సిఎంవో లేఖ విడుదల
జైపాల్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ ప్రకటనలో కొన్ని వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. నేదునూరు, శంకరంపల్లి ప్రాజెక్టులకు గ్యాస్ కేటాయింపులు జరపాలని కోరామని, సొంత రాష్ట్ర ప్రయోజనాలకు చొరవ చూపాలని అంటూ ఆ లేఖలో అన్నారు. ముఖ్యమంత్రి సంతకం లేకుండా ఈ లేఖ జారీ అయింది. ఈ లేఖ వెలువడిన సమయంలో ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా పర్యనటలో ఉన్నారు.
ఆ ప్రాజెక్టులకు గ్యాస్ కేటాయింపులపైనే అక్కడ ఖమ్మంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. కాస్తా నిష్టూరంగానే ఆయన మాట్లాడారు. ఆ రెండు ప్రాజెక్టులకు గ్యాస్ కేటాయించాలని కేంద్రానికి నాలుగు సార్లు లేఖలు రాశామని, కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని, తెలంగాణ మిత్రులు విషయం తెలియకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తనకు అన్ని ప్రాంతాలూ సమానమేనని ఆయన అన్నారు.
తనపై వస్తున్న విమర్శలను జైపాల్ రెడ్డి వైపు మళ్లించడానికి కిరణ్ కుమార్ రెడ్డి ఎత్తు వేసినట్లు ఈ పరిణామం తెలియజేస్తోంది. ఇటీవల మహారాష్ట్రలోని రత్నగిరి ప్లాంటుకు గ్యాస్ మళ్లింపు వివాదం కూడా జైపాల్ రెడ్డి మెడకే చుట్టుకుంది. రాష్ట్రానికి చెందాల్సిన గ్యాస్ మహారాష్ట్రకు తరలిపోతుంటే కేంద్ర మంత్రిగా జైపాల్ రెడ్డి చేతులు కట్టుకుని కూర్చున్నారని, జైపాల్ రెడ్డి చేతగాని తనం వల్లనే గ్యాస్ తరలిపోయిందని ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఆ విమర్శల నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లి ముఖ్యమంత్రి విద్యుచ్ఛక్తి మంత్రి వీరప్ప మొయిలీతోనూ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్తోనూ మాట్లాడి ఫలితం సాధించారు. రత్నగిరి ప్లాంటుకు గ్యాస్ సరఫరాను నిలిపేస్తూ ఆ గ్యాస్ను ఆంధ్రప్రదేశ్కే కేటాయిస్తూ ప్రధాని కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో జైపాల్ రెడ్డిపై కిరణ్ కుమార్ రెడ్డి పైచేయి సాధించారు. తాజాగా తెలంగాణ ప్రాజెక్టులకు గ్యాస్ కేటాయింపును వివాదంగా మార్చి జైపాల్ రెడ్డిపైకి నెట్టే ప్రయత్నాలను కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.