దానం వ్యాఖ్యలపై సబిత కూల్, రౌజీయిజం.. కిషన్ రెడ్డి
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భూమి వివాదంపై నివేదిక ఇవ్వాల్సిందిగా తాను నగర పోలీసు కమిషనర్ను ఆదేశించానని ఆమె చెప్పారు. ఆలయానికి పోలీసు భద్రత పెంచామని చెప్పారు. ఇస్కాన్ పూజారులు తనతో భేటీ అయ్యారని, గుడిలో వేడుకలు జరుపుకునేందుకు అనుమతివ్వాలని కోరారన్నారు. గురువారం జరిగిన ఘటనపై దానం తనతో మాట్లాడారన్నారు. దానం తనకు సోదరుడి లాంటి వారని, రాజకీయాల్లోకి రాకముందే మా కుటుంబ సభ్యుల్లో ఒకడిగా దానం ఉండే వారన్నారు.
దానం రౌడీయిజం.. కిషన్ రెడ్డి
మంత్రి దానం నాగేందర్ దేవాలయాలపై దాడి చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. గుడిపై దాడి చేసి తాళం వేసిన దానంపై గవర్నర్ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ కార్యకర్తలను రక్షించుకునేందుకే తాను ఆలయానికి తాళం వేశానని చెప్పడం విడ్డూరంగా ఉందని, ఇది చట్ట వ్యతిరేకమన్నారు. బాధ్యత కలిగిన మంత్రి రౌడీయుజం చేయడమేమిటని ప్రశ్నించారు. గుడిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న దానం ఏం జరుగుతున్నాయో చెప్పాలన్నారు.
గవర్నర్కు తెలంగాణ న్యాయయవాదుల ఫిర్యాదు
మంత్రి దానం నాగేందర్ను కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయాలని తెలంగాణ ప్రాంత న్యాయవాదులు గవర్నర్ నరసింహన్ను కలిసి విజ్ఞప్తి చేశారు. దానం భూకబ్జాలకు పాల్పడుతున్నారని, అలాంటి వ్యక్తిని మంత్రిగా ఉంచడం సరికాదని వారు అన్నారు.
తాళం వేసే శాఖ ఇవ్వాలి.. రాఘవులు
దానం నాగేందర్కు తన కార్మిక శాఖ పట్ల లేని ఆసక్తి దేవాలయాలకు తాళాలు వేయడంపై ఉన్నట్లుగా కనిపిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు ఎద్దేవా చేశారు. ఆయనను కార్మిక శాఖ నుండి తొలగించి తాళాలు వేసే శాఖను అప్పగిస్తే బాగుంటుందన్నారు. తనకు కేటాయించిన శాఖపై కన్నెత్తి కూడా అతను చూడటం లేదని విమర్శించారు.