వైయస్ జగన్ ఎఫెక్ట్: అందుకే చంద్రబాబు క్లారిటీ
వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించిన తర్వాత తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నుంచి వివిధ సామాజిక వర్గాలు అటు వైపు మళ్లాయి. ఎస్సీలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మద్దతు ఇస్తున్నారనేది ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలను బట్టి కూడా తేలిపోయింది. నిజానికి, ఎస్సీల్లోని మాలమాదిగలు మొదట కాంగ్రెసు పార్టీ వెంట ఉండేవారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) వచ్చిన తర్వాత రెండుగా చీలిపోయారు. ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మార్పీయస్కు బలమైన మద్దతుదారుగా నిలిచింది. దాంతో మాదిగలు చాలా వరకు తెలుగుదేశం వైపు వచ్చారు. ఆ కారణంగానే మాదిగ నేతలు పలువురు పార్లమెంటుకు, శాసనసభకు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు.
తాజా పరిణామాల నేపథ్యంలో మాలమాదిగలు కూడా వైయస్సార్ కాంగ్రెసు వైపు చూస్తున్నారనే అంచనాలు వస్తున్నాయి. వైయస్ జగన్ వైపు మాదిగలు వెళ్లకుండా చూడాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై మరోసారి పార్టీలో చర్చించి స్పష్టత ఇచ్చారని అంటున్నారు. వర్గీకరణకు పూర్తి మద్దతు ప్రకటించారు. దాంతో మళ్లీ మాదిగల మద్దతును పార్టీకి కూడగట్టుకోవచ్చుననేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. ఈ స్థితిలో వైయస్ జగన్ ఎస్వీ రిజర్వేషన్ల వర్గీకరణపై తన వైఖరిని ప్రకటించాల్సిన స్థితిలో పడతారని అంటున్నారు. అలాంటి పరిస్థితిని జగన్కు కల్పించడం కూడా వర్గీకరణపై చంద్రబాబు మరోమారు స్పష్టత ఇవ్వడంలోని ఆలోచన అంటున్నారు.
బిసీలను తిరిగి తమ వైపు తిప్పుకోవడానికి ఇటీవల బిసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు వివిధ సామాజిక వర్గాలను తిరిగి పార్టీ చట్రంలోకి తీసుకు రావడానికి కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఎస్సీ వర్గీకరణపై మరోమారు స్పష్టత ఇచ్చారని అంటున్నారు. వర్గీకరణకు మద్దతు ప్రకటించడంపై పార్టీలో పెద్దగా వ్యతిరేకత ఎదురు కాలేదని అంటున్నారు. ఇది వరకు తీసుకున్న నిర్ణయమే కాబట్టి దానికి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం కూడా లేదని అంటున్నారు.