కూల్చితేనే తెలంగాణ, 18మంది బెదిరిస్తే వచ్చేది: కెకె
కేంద్రం, కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇస్తే రాజకీయంగా మనకేం ఉపయోగమన్నట్లుగా వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రభుత్వం పడగొట్టే వరకు వెళితేనే కేంద్రం దీనిపై దృష్టి సారిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సమయంలో పద్దెనిమిది మంది శాసనసభ్యులు తెలంగాణ ఇస్తేనే మద్దతిస్తామంటే కేంద్రం, కాంగ్రెసు దిగి వచ్చేవని అభిప్రాయపడ్డారు.
ఇరవై మంది తెలంగాణ-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారం పాటు అసెంబ్లీకి డుమ్మా కొడితే, అధిష్ఠానంపై ఒత్తిడి వచ్చి తెలంగాణ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఏ పార్టీ అయినా ఏ జెండా అయినా అందరూ తెలంగాణ కోసం పోరాడితేనే రాష్ట్రం ఏర్పడుతుందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. ఐక్యవేదిక నిర్మించి పోరాడాలని ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ సూచించారు.
చంద్రబాబు, బొత్సలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను కలిసి ఉద్యమానికి సహకారం కోరతామని గజ్జెల కాంతం వెల్లడించారు. 27వ తేదీన తెలంగాణ విద్యార్థుల మార్చ్ చేపడతామని, 30న హైదరాబాద్లో మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ నగారా సమితి ప్రతినిధి హరీశ్వర్రెడ్డి, విద్యార్థి ప్రతినిధులు పాల్గొన్నారు.