చిక్కుల్లో ధర్మాన: హుటాహుటిన ఢిల్లీకి పయనం
తాజా పరిణామంతో ధర్మాన ప్రసాద రావు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి వివరణ ఇచ్చేందుకు ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. వాన్పిక్ కేసులో తన పేరును సిబిఐ నిందితుడిగా చేర్చడంపై ధర్మాన విస్మయం వ్యక్తం చేశారు. తాను మీడియా కథనాలనే చూశానని, చార్జిషీట్ చూసిన తర్వాత తాను స్పందిస్తానని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
ధర్మాన పేరును నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో మిగిలిన నలుగురు మంత్రుల్లో గుబులు ప్రారంభమైంది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు ఆరు మంత్రులకు, ఎనిమిది ఐఎఎస్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఆరు మంత్రుల్లో మోపిదేవి వెంకటరమణ ఇది వరకే అరెస్టు కాగా, తాజాగా ధర్మాన ప్రసాద రావును నిందితుడిగా చేరుస్తూ సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. దీంతో తమకు ఎప్పుడు ముప్పు వాటిల్లుతోందో అనే భయాందోళనలను వారిలో అమలుముకున్నాయి.
మంత్రులు సిబితా ఇంద్రారెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య భవిష్యత్తుపై విస్తృతంగా చర్చ సాగుతోంది. నిందితులుగా సిబిఐ చార్జిషీట్లో పేర్లు ఉన్న ఐఎఎస్ అధికారుల్లోనూ గుబులు చోటు చేసుకుంది. ఐఎఎస్ అధికారులు శామ్యూల్, మన్మోహన్ సింగ్ పేర్లను సిబిఐ చార్జిషీట్లో చేర్చింది.
ఇదిలావుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన కార్యాలయం అధికారులతో సమావేశమయ్యారు. తాజా పరిణామంపై ఆయన న్యాయనిపుణుల సలహా కోరినట్లు తెలుస్తోంది.