మహాత్ముడితో జగన్కు పోలిక: విహెచ్ వినూత్న నిరసన
ఈ సందర్భంగా ఆయన మహాత్మా గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం భారీగా పాలతో నిండిన బిందెలను అక్కడకు తరలించారు. పాలాభిషేకం కూడా వినూత్నంగా చేసి విహెచ్ అందరినీ ఆకట్టుకున్నారు. మహాత్ముడికి పాలాభిషేకం చేసేందుకు ఆయన ఓ భారీ ఫైరింజన్ను తెప్పించారు. ఆ ఫైరింజన్తో అభిషేకం చేయించడం విశేషం. అయితే అక్కడి మహాత్ముడి విగ్రహం భారీ ఎత్తులో ఉంది. దానికి తోడు ఫుట్ పాత్ అడ్డొస్తుంది.
దీంతో విహెచ్ అక్కడకు ఓ భారీ క్రెయిన్ కూడా తెప్పించారు. ఫుట్ పాత్ను పగుల గొట్టించి అభిషేకానికి అనువుగా ఉండేలా ఏర్పాటు చేశారు. ఫుట్ పాత్ పగులగొట్టడంపై విమర్శలు రావడంతో విహెచ్ జాతిపితకు జరిగిన అన్యాయానికి నిరసనగా తాను ఇది చేస్తున్నానని, ఫుట్ పాత్ను తిరిగి కట్టిస్తానని విహెచ్ చెప్పారు.
కాగా గుంటూరుకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత శ్రీనివాస రావు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో జగన్ను, మహాత్ముడిని పక్క పక్కన ఉంచి వారిద్దరినీ జైలులో ఉన్నట్లు ఆ ఫ్లెక్సీలో చిత్రీకరించారు. తెల్లదొరల కాలంలో మహాత్ముడు జైలుకు వెళ్లారని, నల్ల దొరల కాలంలో జగనన్న జైలుకు వెళ్లారని ఆ ఫ్లెక్సీలో రాశారు. అంతేకాదు ఓ మహాత్మా ఇది న్యాయమా అంటూ చివరలో రెండు వ్యాఖ్యలు కూడా రాశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగింది.