యువతిని మోసం చేసిన జడ్జిని డిస్మిస్ చేసిన హైకోర్టు
2009లో విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా ఉన్నప్పుడే సూర్య ప్రకాష్పై అనేక ఆరోపణలు వచ్చాయి. అంతకుముందు ఆయన విశాఖ జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నప్పుడు హారిక అనే మహిళ విడాకుల కేసును వాదించారు. క్రమంగా ఆమెతో పరిచయం పెంచుకుని ప్రేమాయణం సాగించారు. హారిక ఒత్తిడి మేరకు సన్నిహితుల సమక్షంలో 2007లో ఆమె మెడలో పసుపుకొమ్ము కట్టారు.
ఆ తర్వాత ఇద్దరూ కొన్నాళ్లు సహజీవనం చేశారు. అయితే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని తన ఇంట్లో సూర్య ప్రకాష్ రావు మరో యువతితో 2008లో వివాహానికి ఏర్పాట్లు చేసుకున్నారు. దీనిని వ్యతిరేకించిన హారిక సూర్య ప్రకాష్ని నిలదీసింది. వారు కలిసి ఉన్న వీడియో క్లిప్పింగ్లను ఆధారాలుగా చూపుతూ మహిళా చేతన సంఘం సహకారంతో విజయనగరం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఈలోగా సూర్య ప్రకాష్ ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యారు.
హారిక ఫిర్యాదుపై స్పందించిన హైకోర్టు.. సూర్య ప్రకాష్ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. దీంతో విజయనగరం జిల్లా జడ్జి విచారణ జరిపి హారిక ఆరోపణలను నిర్ధారిస్తూ హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. న్యాయం అందించాల్సిన బాధ్యతాయుత పదవిలో ఉండి కూడా ఓ మహిళను మోసం చేసినందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన దుష్ప్రవర్తనకు శిక్షగా ఆయన్ను విధుల నుంచి తొలగించాలని ఆదేశించింది. ఈ మేరకు రిజిస్ట్రార్ నుంచి ఆదేశాలు అందుకున్న రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేస్తూ మంగళవారం జీవో జారీ చేసింది.