ఎపి పైనా ఎఫెక్ట్: నగరం వీడుతున్న ఈశాన్యవాసులు
ఈశాన్య రాష్ట్రాల ప్రజలు వెళుతుండటంతో రైల్వే స్టేషన్ కిట కిటలాడుతోంది. సుమారు పదివేల మంది ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లేందుకు నగరం నుండి పయనమైనట్లుగా సమాచారం. మరోవైపు పోలీసు అధికారులు రక్షణ లేదనే భయంతో ఎవరూ హైదరాబాద్ విడిచి వెళ్లవద్దని సూచిస్తున్నారు. ఎవరికైనా ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చినా, మెసేజ్లు వచ్చినా పోలీసుల దృష్టికి తీసుకు వస్తే రక్షణ కల్పిస్తామని చెప్పారు. అస్సామీ అల్లర్ల ప్రభావం ఇక్కడ లేదన్నారు.
మరోవైపు ఈశాన్య రాష్ట్రాల వారు బెదిరింపులకు భయపడి వెళ్లడం లేదని వారి రాష్ట్రంలోని పరిస్థితుల దృష్ట్యా అక్కడ తమ వారిని చూసేందుకు, వారు రమ్మని ఫోన్లు చేసినందు వల్లనే వెళుతున్నారని సిద్ధిక్ నగర్ స్థానికులు చెబుతున్నారు. ఒకవేళ వారు భయపడి వెళ్లదల్చుకున్నా తాము అండగా ఉంటామని వారికి స్పష్టం చేశామని, అయితే వారు మాత్రం తాము భయంతో వెళ్లడం లేదని చెబుతున్నారని అంటున్నారు.