బస్సులో హత్యలు: వీడుతున్న మిస్టరీ, ఆ సైకో భార్యనూ
ప్రస్తుత తడ ఎస్సై శ్రీనివాస రెడ్డి ఏడాది కిత్రం మనుబోలు ఎస్సైగా ఉన్నప్పుడు ఓ మెడికల్ రెప్ భార్యతో గొడవపడి పోలీసుస్టేషన్కు వచ్చాడు. ఆ కేసులో ఎస్ఐ విచారించి రెప్పై కేసు నమోదు చేశారు. తన వైపు న్యాయం ఉన్నా, కేసు పెట్టి ఇబ్బంది పెట్టాడని ఆ రిప్ ఎస్సైపై కక్ష పెంచుకున్నాడు. ఇటు కక్ష.. అటు భార్య దూరమయిందన్న మనోవేదనతో ఆ రెప్ సైకోగా మారాడు. ఏదో ఒక రూపంలో ఎస్సైను ఇరకాటంలో పెట్టి మానసికంగా ఇబ్బంది పెట్టాలని పథకం పన్నాడు.
ఇటీవల ఎస్సై శ్రీనివాస రెడ్డి తడకు బదిలీ అయ్యారు. అప్పుడప్పుడు ఫోన్ చేసి తిడుతున్నా ఎస్సై పెద్దగా పట్టించుకోలేదు. గత నెల 26న భద్రచలం డిపో బస్సు చెన్నై వెళుతుండగా తడ వద్ద ఓ ఆగంతకుడు ముగ్గురు ప్రయాణికులను హతమార్చి పరారయ్యాడు. ఆ మారణహోమం తానే చేశానని, దమ్ముంటే పట్టుకోమంటూ ఎస్సై మొబైల్కు ఎస్సెమ్మెస్ పంపాడు. అప్పట్లో పెద్దగా పట్టించుకోని ఎస్సై ఆ తర్వాత ఎస్సెమ్మెస్ వ్యవహారాన్ని పోలీస్ ఉన్నతాధికారులకు తెలిపారు. ఫోన్ నెంబర్ ఆధారంగా రెప్ను అదుపులోకి తీసుకున్నారు.
ఘటన జరిగిన రోజున బస్సులో ఉన్న ప్రయాణికులు, డ్రైవర్ కూడా ఆగంతకుడు ఇతడేనని చెప్పినట్లు తెలిసింది. దీంతో పోలీసులు అతడ్ని వింజమూరు సమీపంలో ఓ ప్రైవేటు అతిథిగృహంలో ఉంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం గుంటూరు రేంజ్ ఐజీ హరీష్ కుమార్ గుప్తా కూడా విచారించినట్లు తెలుస్తోంది. శస్త్రచికిత్స సమయంలో వాడే కత్తులు, వైద్య పరిజ్ఞానంతో హత్య చేయడం ఇవన్నీ అతడి పనేనని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. రెండు, మూడు రోజుల్లో రెప్ను కోర్టుకు హాజరుపరిచే అవకాశం ఉంది. సైకో శ్రీనుది నల్గొండ జిల్లా అని తెలుస్తోంది.