సోనియా ఎపి మిషన్: కాయకల్ప చికిత్సకు ముగ్గురు
కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్కు తోడుగా కేంద్ర మంత్రులు వాయలార్ రవి, ఎకె ఆంటోనీ కూడా రంగంలోకి దిగనున్నారు. వాయలార్ రవి ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాలపై దృష్టి పెట్టారు. కొత్తగా ఆంటోనీ రంగంలోకి వస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత వీరు ముగ్గురు కూడా ఒకరి తర్వాత ఒకరు రాష్ట్రంలో పర్యటించి, నాయకులతో చర్చించి, పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తారని అంటున్నారు.
గత మూడేళ్లలో కాంగ్రెసు పార్టీ పరిస్థితి గణనీయంగా దిగజారిందనే అంచనాలు సాగుతున్నాయి. రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు కూడా తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు. సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో వారిలో ఆందోళన పెరుగుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే విజయం సాధించడం మాట అటుంచి, ఘోర పరాజయం చవి చూడాల్సి వస్తుందని వారు భయపడుతున్నారు. ఇందులో తెలంగాణ, సీమాంధ్ర తేడా లేదు. ఇదే విషయాన్ని వారు ఇటీవల అధిష్టానం వద్ద చెప్పారు కూడా.
ఇండియా టుడే - నీల్సన్ సర్వే దేశవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన సర్వే ఫలితాలు కూడా కాంగ్రెసు దయనీయమైన స్థితిలో ఉన్న విషయాన్ని వెల్లడిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో యుపిఎకు కేవలం 3 నుంచి 8 సీట్లు మాత్రమే వస్తాయని ఆ సర్వేలో వెల్లడైంది. ఇది సమయంలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పుంజుకుంటున్నట్లు వెల్లడైంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 23 నుంచి 27 సీట్లు రావచ్చునని అంచనా వేసింది. మిగతా పార్టీలకు 12 సీట్ల దాకా రావచ్చునని సర్వే వెల్లడించింది.
పార్టీని సాధ్యమైనంత త్వరగా గాడిలో పెట్టడానికి కీలకమైన అంశాలపై స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపైన కూడా ముగ్గురు మూర్తులు దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఈ ముగ్గురు రాష్ట్రంలో కాంగ్రెసుకు కాయకల్ప చికిత్స చేస్తారా వేచి చూడాల్సిందే.