ఈఎన్టి ఇష్యూ: మంత్రి కొండ్రు మురళి సంతకం ఫోర్జరీ
తన సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటనపై విచారణ ప్రారంభించామని, హోంశాఖ మంత్రికి కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఆస్పత్రి స్థలాన్ని తప్పకుండా రక్షిస్తామని చెప్పారు. ఆస్పత్రి స్థలాన్ని ఇతర వ్యక్తులకు క్రమబద్ధీకరిస్తూ వెలువడిన జీవోలు తాత్కాలికంగా నిలిపివేతలో ఉన్నాయని, ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాటనుంచి తిరిగి రాగానే వాటిని పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఈఎన్టి స్థల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.
కాగా ఈఎన్టి ఆస్పత్రి స్థలం విషయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ, ఈనాడు అధినేత రామోజీ రావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులును దొమ్మీలను రెచ్చగొట్టేవారిగా చిత్రీకరిస్తూ రమేశ్ అనే వ్యక్తి ఫిబ్రవరి 23న వైద్య విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపించి మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలంటూ గత ఏప్రిల్లో మంత్రి కోండ్రు మురళి వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లుగా వార్తలు వచ్చాయి.
కాగా మంత్రి సంతకం ఫోర్జరీ కావడంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు స్పందించారు. ఈఎన్టి ఆసుపత్రి స్థలంపై వచ్చిన ఫిర్యాదును తాను చూడలేదని మంత్రి కోండ్రు మురళీ మోహన్ అంటున్నారని, సంతకం కూడా తనది కాదంటున్నారని, మంత్రి సంతకమే ఫోర్జరీ జరిగితే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఈఎన్టి ఆసుపత్రి స్థలం విషయమై తన పైనా, తమ పార్టీ నేతలతోపాటు కొందరు మీడియా అధినేతల పైనా రమేశ్ అనే వ్యక్తి తరఫున డాక్టర్ టికె శ్రీనివాసులు వినతిపత్రాన్ని సమర్పిస్తే.. మూడు వారాల్లో నివేదిక పంపాలని మంత్రి ఆదేశించడంపై రాఘవులు స్పందించారు.
సచివాలయంలో శనివారం మంత్రి కొండ్రు మురళీని కలిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ సంతకం మంత్రిది కాకపోతే ఫోర్జరీయా? అని ప్రశ్నించారు. అప్పటి కలెక్టర్ నవీన్ మిట్టల్ ఈఎన్టి ఆస్పత్రి స్థలాన్ని అక్రమంగా క్రమబద్ధీకరించడంపై సిపిఎం సహా అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయని, ఇవి అన్ని పత్రికల్లోనూ ప్రముఖంగా వచ్చాయని; ఫలితంగానే ఆ జీవోలను అబయెన్స్లో పెట్టారని గుర్తుచేశారు. ఆ జీవోలను రద్దు చేసి, స్థలాన్ని భూ కబ్జాదారుల నుంచి రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
దీనిపై తప్పుడు ఫిర్యాదులు ఇచ్చిన వారిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాఘవులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 26 వివాదాస్పద జీవోలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేయాలని రాఘవులు డిమాండ్ చేశారు. మంత్రులు ఎంత తొందరగా రాజీనామా చేస్తే అంత మంచిదని, లేకపోతే కాంగ్రెస్ పార్టీకే నష్టమని, ఆ పార్టీ సర్వనాశనమవుతుందని వ్యాఖ్యానించారు. ఆయన వెంట పార్టీ నేతలు పి.మధు, ఐ.వెంకటేశ్వరరావు తదితరులున్నారు.