మేమే గెలుస్తాం, ఇంకా నిర్ణయం తీసుకోలేదు: కిరణ్
యువతకు సహకరించేందుకే రాజీవ్ యువకిరణాలు పథకాన్ని ప్రవేశ పెట్టినట్లు చెప్పారు. యువత కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలన్నారు. రాష్ట్ర యువతను ముందుకు తీసుకు పోయేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాబోయే మూడేళ్లలో యువకిరణాల పథకం ద్వారా యువతకు 15 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. యువకిరణాలలో అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదన్నారు. ఈ పథకం ద్వారా ఈ ఏడాది సుమారు 3.6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు.
మొదటి ఆరు నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. యువతలో నైపుణ్యం పెంచి ఉద్యోగం కల్పించడమే రాజీవ్ యువకిరణాల ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఉన్నత చదువులు లేనప్పటికీ ఈ కార్యక్రమం ద్వారా ఉపాధి పొంది కుటుంబాలను పలువురు యువకులు పోషించుకోగల్గుతున్నారన్నారు. పాలకొల్లు, నర్సాపురం నియోజకవర్గాలలో ఆయన ఇందిర బాట నిర్వహించారు. కిరణ్ పాలకొల్లులో కాటన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
మంత్రి ధర్మాన ప్రసాద్ రాజీనామాపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. 2014 వరకు తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. వచ్చే సాధారణ ఎన్నికలలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో తామే గెలుస్తామన్నారు. జలప్రభ ద్వారా ఎస్సీ, ఎస్టీలకు రుణాలు ఇస్తామన్నారు. పోలవరం పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని, కృష్ణా, గోదావరి నదుల ఆధునికీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పామాయిల్ రైతులకు వ్యాట్ వద్దన్నారు. కాగ్ నివేదిక భగవద్గీత కాదని, వాటిలో వచ్చినవన్నీ నిజాలు అనుకుంటే పొరపాటు అన్నారు. దేశవ్యాప్తంగా కరెంట్ కోత ఉందన్నారు.