స్వామి వారి లడ్డూకు జిఐ గుర్తింపు, అభ్యంతరాలకు నో
తిరుపతి లడ్డూకు 2009-10లోనే జిఐ లభించింది. అయితే, కేరళవాసి ప్రవీణ్ రాజ్ దీనిపై అభ్యంతరం వ్యక్తంచేశారు. తిరుపతి లడ్డూ ఒక ప్రసాదం మాత్రమేనని, వస్తువు కాదని, దీనికి జిఐ హోదా కల్పిస్తే భవిష్యత్తులో అనేక దేవాలయాలు ఇదే బాటపట్టే అవకాశముందని వాదించారు. దీనిపై సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం కూడా వేశారు. జిఐ హోదా పొందిన వస్తువుకు నిర్దిష్ట ప్రమాణాలున్నాయని ద్రువీకరించినట్లేనని వాదించారు.
ఒక ప్రాంతానికి ప్రత్యేకమైన ఈ వస్తువుల తయారీపై ఏ ఒక్క వ్యక్తి, లేదా సంస్థ సొంత పేటెంట్ పొందకుండా జిఐ అడ్డుకుంటుందని, అందువల్ల ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులకు జిఐ హోదా కల్పించడం వల్ల, ఈ ద్రువీకరణ స్ఫూర్తి దెబ్బతింటుందని ప్రవీణ్ రాజ్ అన్నారు. తిరుపతి లడ్డూ మార్కెట్లో దొరికే వస్తువు కాదని, దేవుడి సన్నిధానంలో అందించే పవిత్ర ప్రసాదమని, దీనికి జిఐ హోదా ఇచ్చి వస్తువు స్థాయికి కుదించటం సరికాదన్నారు.
పైగా లడ్డూకు జిఐ హోదా కల్పించడం పేరు గొప్పకే తప్ప, ఇతర ప్రయోజనాలేవీ ఉండవని అభిప్రాయపడ్డారు. అయితే, ఈ అంశంపై మద్రాసు హైకోర్టులోనూ పిల్ దాఖలు కావడంతో, అక్కడే తేల్చుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది. దీంతో ఆయన హైకోర్టు మెట్లెక్కారు. లడ్డూకు జిఐ హోదాపై తమ దాకా రానక్కర్లేదని... ఈ నిర్ణయం తీసుకున్న చెన్నైలోనే రిజిస్ట్రీకి అప్పీలు చేసుకోవాలని హైకోర్టు తెలిపింది. ఆ మేరకు ప్రవీణ్రాజ్ జిఐ రిజిస్ట్రీలో సవాల్ చేశారు. అక్కడా చుక్కెదురైంది.
జిఐ హోదా ఇస్తే మీకు అభ్యంతరమేమిటని రిజిస్ట్రీ ప్రశ్నించింది. మీరు లడ్డూలు అమ్ముకోవడం లేదు కదా, మరి మీకెందుకు అభ్యంతరమని ప్రశ్నించింది. పైగా తిరువనంతపురంలో ఉండే ఆయనకు తిరుపతి లడ్డూతో భౌగోళిక సంబంధం లేదని తెలిపింది. తిరుపతిలో లడ్డూను టిటిడి సిబ్బంది సంఘటితంగా తయారు చేస్తారని.. దీనికి జిఐ హోదా ఇవ్వడం సరైనదేనని స్పష్టం చేస్తూ ఈనెల 7న అప్పీలును కొట్టివేసింది. ఆయనకు రూ.10వేలు జరిమానా కూడా విధించింది.