రాజీవ్ పుణ్యమే: కిరణ్, పాలన ఉందా అని... పల్లంరాజు
ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడారు. రాజీవ్కు టెక్నాలజీ అంటే ఎంతో ఇష్టమని, భారత్ సాంకేతికంగా ముందుకు వెళితే ప్రపంచంలోని ఇతర దేశాలతో పోటీ పడగలమని ఆయన భావించే వారని అన్నారు. అందుకే టెక్నాలజీ వృద్ధిని, కంప్యూటర్ల వాడకాన్ని ఆయన ఎంతో ప్రోత్సహించే వారన్నారు. సామాన్యుడికి కూడా ఈ రోజు సెల్ ఫోన్, ఇంటర్నెట్, టివిలు అందుబాటులో ఉన్నాయంటే అది రాజీవ్ పుణ్యమే అన్నారు. టెక్నాలజీని పారదర్శకంగా వాడాలని, అది ప్రజలకు ఉపయోగపడాలని భావించిన వ్యక్తి రాజీవ్ అన్నారు.
18 ఏళ్ల వారికి ఓటు హక్కు కల్పించిన ఘతన ఆయనదే అన్నారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం వస్తేనే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అన్నారు. ఐకెపి ద్వారా వారికి భారీగా రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికలలో మహిళలకు యాభై శాతం కేటాయిస్తామన్నారు.
పార్టీ ప్రయోజనాల కోసం అందరం కలిసి కట్టుగా పని చేస్తామని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. త్వరలో పిసిసి పునర్వవ్యవస్థీకరణ ఉంటుందని ఏఐసిసి పరిశీలకులు కృష్ణమూర్తి అన్నారు. రాజీవ్ ఆశయాలకు తగ్గట్లుగా పాలన ఉందా లేదా అన్న విషయాన్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలని మంత్రి పల్లం రాజు అన్నారు. ఇలాగే సాగితే భావితరాలు మనలను క్షమించవన్నారు.
సోనియా గాంధీకి బలం చేకూర్చి, 2014లో రాహుల్ గాంధీని ప్రధానిని చేసే దిశలో పని చేయాలని డి శ్రీనివాస్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలను దరికి చేకూర్చుకుంటేనే కాంగ్రెసు పార్టీకి లబ్ధి చేకూరుతుందని వి. హనుమంత రావు అన్నారు.