ఆరోగ్యశ్రీపై వైయస్ ముద్రను చెరిపేసిన కిరణ్
ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయ భవనం హైదరాబాదులోని జూబ్లీహిల్స్లో ఉంది. దానిపై వైయస్ రాజశేఖర రెడ్డికి చెందిన చిహ్నాలను క్రమంగా తొలగించే పని గత రెండు నెలలుగా సాగుతోంది. భవనం పేరునే కాకుండా లెటర్ హెడ్స్ను కూడా మార్చేశారు. ఆరోగ్యశ్రీ పథకంతో వైయస్ రాజశేఖర రెడ్డికి సంబంధం లేదనే భావన కలగించడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలకు దరఖాస్తులు చేసుకునేవారికి వైయస్ పేరు గుర్తుకు రాకుండా చేయాలనేది ప్రభుత్వ ప్రయత్నంగా కనిపిస్తోంది.
వైయస్ మరణించిన తర్వాత రెండు నెలలకు 2009 డిసెంబర్లో ఆరోగ్యశ్రీ ట్రస్టు భవనాన్ని ప్రారంభించారు. దానికి డాక్టర్ వైయస్ భవనంగా నామకరణం చేశారు. ప్రస్తుతం దాన్ని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్గా మార్చింది. తెలుగు, ఆంగ్ల భాషల్లో ఉన్న వైయస్ రాజశేఖర రెడ్డి పేరను కూడా తొలగించారు. భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రవేశద్వారం వద్ద పెట్టిన లైఫ్ సైజ్ వైయస్ రాజశేఖర రెడ్డి బొమ్మను కూడా ఇటీవలే తొలగించారు.
ఆరోగ్యశ్రీకి సంబంధించిన అన్ని పత్రాలపై వైయస్ పేరు లేకుండా జాగ్రత్త పడ్డారు. ప్రభుత్వోద్యోగులకు హెల్త్కేర్ నిధి కింద ఇచ్చే కార్డులపై ఇక నుంచి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బొమ్మ మాత్రమే కనిపిస్తుందని అంటున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చైర్మన్గా, వైద్య విద్యాశాఖ మంత్రి కొండ్రు మురళి వైస్ చైర్మన్గా ఉన్నారు. ఇదే సమయంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని అన్ని వర్గాలకు విస్తరించే ప్రయత్నాలు కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం.
వైయస్ రాజశేఖర రెడ్డి పేరు కాంగ్రెసు పార్టీకి ఉపయోగపడకపోగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు రాజకీయంగా ప్రయోజనం చేకూరుస్తుందనే విషయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలు వైయస్ పేరు జగన్కు మాత్రమే ఉపయోగపడిందని, కాంగ్రెసుకు పనికి రాలేదని ఆయన బావిస్తున్నారు. దీంతో అత్యంత ప్రజాదరణ పొందిన ఆరోగ్యశ్రీ పథకంపై వైయస్ ముద్రను చెరిపేయడానికి ఆయన పూనుకున్నట్లు చెబుతున్నారు.