ఎన్నిక చెల్లదు: ఎమ్మెల్యే జనార్ధన్కు హైకోర్టులో షాక్
తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు సమర్పించి అతను పోటీ చేశాడని కోర్టు పేర్కొంది. జనార్ధన్ థాట్రాజ్ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మేనల్లుడు. ఇతను గత సాధారణ ఎన్నికలలో కురుపాం నుండి కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ నియోజకవర్గం ఎస్టీకి రిజర్వ్ అయింది. దీంతో జనార్ధన్ తాను ఎస్టీనని చెప్పి నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై టిడిపి మాజీ ఎమ్మెల్యే జయరాజ్ కోర్టుకు గడప తొక్కారు. గతంలో శత్రుచర్ల విజయ రామరాజు ఇదే కురుపాం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అప్పుడు కూడా హైకోర్టు శత్రుచర్ల ఎస్టీగా తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించారని, ఆయన ఎన్నిక చెల్లదని పేర్కొంది. ఇదే విషయాన్ని టిడిపి నేత కోర్టుకు విన్నవించారు. శత్రుచర్ల గతంలో ఎస్టీగా ఈ నియోజకవర్గం నుండి గెలుపొందారని, కోర్టు ఆయన ఎన్నికను తప్పు పట్టిందని, ఇప్పుడు ఆయన మేనల్లుడు జనార్ధన్ కూడా ఎస్టీగా కురుపాం నుండి గెలుపొందారని, మేనమామ విషయంలో తప్పయింది మేనల్లుడి విషయంలో ఎలా తప్పవుతుందని అన్నారు.
కోర్టు పత్రాలు పరిశీలించి, ఇరువురి వాదనలను విన్నది. అనంతరం జనార్ధన్ ఎన్నిక చెల్లదని తేల్చి చెప్పింది. జనార్ధన్ కొండదొరలు. వారిని రాజులుగా పరిగణిస్తారు. కాగా హైకోర్టు తీర్పును తాను గౌరవిస్తానని, ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేస్తానని జనార్ధన్ చెప్పారు.