ఎవరో లబ్ధి పొందితే..., ఆయనే చెప్పాలి: జగన్పై వట్టి
మంత్రులుగా తమ బాధ్యతలు తాము నిర్వర్తించామని ఆయన అన్నారు. మేం మా హక్కుల కోసం పోరాడతామని చెప్పారు. మంత్రివర్గ నిర్ణయాలలో ఎలాంటి తప్పు లేదని, అయినా ఆర్టికల్ 163 ప్రకారం కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు. మంత్రులను దోషులుగా, దొంగలుగా చిత్రీకరించవద్దని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా హడావుడి చేసి మంత్రులను నేరస్తులుగా చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిర్ధారణ అయ్యే వరకు ఎవరూ నిందితుడు కాదని, కానీ మీడియా మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తోందన్నారు. ఎవరో లబ్ధి పొందితో తమకు ఆపాదించవద్దని విజ్ఞప్తి చేశారు. లబ్ధి పొందిన వ్యక్తి జవాబు చెప్పుకోవాల్సి ఉంటుందని జగన్ను ఉద్దేశించి అన్నారు. మంత్రుల మీద క్విడ్ ప్రో చూపిస్తున్నారని, కానీ ఏ మంత్రి కూడా వ్యక్తిగతంగా లబ్ధి పొందింది లేదన్నారు. అలా అని రుజువు కూడా కాలేదన్నారు. దర్యాఫ్తు సంస్థలు ఓవరాక్షన్ చేస్తున్నాయన్నారు. అందుకే తమ ఆవేదనను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకు వెళుతున్నట్లు చెప్పారు.
మంత్రివర్గ బృందం తిరుగుబాటు కోసం కాదని, ఏ తప్పు చేయని తాము బలి కావడం తమకు ఆవేదన కలిగిస్తోందన్నారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, మంత్రి ధర్మాన ప్రసాద రావులను తాము రక్షించుకుంటామని అన్నారు. సిబిఐ రాజ్యాంగ బద్దంగా పని చేస్తుందో లేదో తేల్చాలన్నారు. సిబిఐకు తమను ప్రశ్నించే హక్కు లేదన్నారు.