గీతికా శర్మ కోసం బోరున ఏడ్చాడు: కందా భార్య
గీతికా శర్మ ఉరేసుకుందని ఉద్యోగుల్లో ఒకరు ఫోన్ చేసి చెప్పారని, ఆ సమయంలో కందా కార్యాలయానికి బయలుదేరుతున్నారని ఆమె చెప్పారు. ఆ సమాచారం విన్న వెంటనే తన భర్త బోరును విలపించడం ప్రారంభించారని, గీతిక ఆత్మహత్య వెనక కుట్ర ఉందని అన్నారని ఆమె వివరించారు.
తన భర్తపై ఆరోపణలు చేస్తున్న గీతికా శర్మ కుటుంబ సభ్యులను ఆమె ప్రశ్నించారు. తమ ఇద్దరి కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉండేవని, చాలా సార్లు ఇరు కుటుంబాల వాళ్లం షిర్డికి కలిసి వెళ్లామని ఆమె చెప్పారు. గీతికా శర్మ ఎండిఎఎల్ఆర్లో చేరడమే అసలు విషయాన్ని తెలియజేస్తోందని ఆమె అన్నారు. తన భర్త దుర్మార్గుడైతే తమ కూతురిని మళ్లీ ఉద్యోగానికి ఎలా పంపుతారని, తామేమీ బలవంతపెట్టలేదని, వారేమైనా మాట్లాడవచ్చుగానీ తప్పేమీ జరగలేదని, గీతిక ఇక్కడ ఉన్నది తక్కువ కాలమేమీ కాదని, ఆరేళ్లు తక్కువ కాలం కాదని ఆమె అన్నారు.
తాను ఓ రోజు కార్యాలయానికి వెళ్లి తన జన్మదినం రోజు షిర్డీకి వెళ్తామని తాను తన భర్తకు చెప్పానని, అప్పుడు గీతిక కూడా ఉందని, వాళ్ల తల్లిదండ్రులు కూడా షిర్డీ వెళ్దామని అంటున్నారని గీతిక చెప్పిందని, అందరం కలిసి షిర్డీకి వెళ్లే ప్లాన్ అలా జరిగిందని, చాలా అద్భుతంగా జరిగిందని, షిర్డీలో తాము ఓ రాత్రి ఉన్నామని, తిరిగి రావడానికి ముందు ఓ రోజు రాత్రి ముంబై హోటల్లో ఉన్నామని ఆమె వివరించారు.
గీతిక పెళ్లిలో గోపాల్ గోయల్ కందా మామగా తన పాత్ర పోషించాలని ఆమె తల్లి అంటూ ఉండేదని సరస్ కందా చెప్పారు. కందా ప్రేరేపణ వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గీతికా శర్మ తన సూసైడ్ నోట్లో రాసింది. దాంతో 11 రోజుల పాటు కందా పరారీలో ఉన్నారు.