పిసిసి చీఫ్గా బొత్స అవుట్: చిరంజీవి ఇన్?
బొత్స సత్యనారాయణ రెండు పదవుల్లో ఉన్నారనే ఓ కారణాన్ని చూపిస్తూ ఆయన ఒక్క పదవిలోనే కొనసాగేలా చర్యలు తీసుకోనున్నారు. అయితే ఈ విషయమై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పక్షం రోజుల్లో అధిష్టానం ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఇదంతా బొత్సను పిసిసి పదవి నుంచి తప్పించడానికి జరిగిన కుట్రగా బొత్స అనుచరులు అనుకుంటున్నారు. బొత్సపై మద్యం సిండికేట్ల వ్యవహారంపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
కాగా ఢిల్లీలో కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి హుషారుగా కనిపిస్తున్నారు. గురువారం ఉదయం యుపిఏ అధ్యక్షురాలు సోనియాగాంధీతో దాదాపు 20 నిముషాలపాటు చిరంజీవి సమావేశమయ్యారు. పీసీసీ అధ్యక్షునిగా చిరంజీవి నియమించే అవకాశముందని, అందుకు సిద్ధంగా ఉండాలని అధిష్టానం సూచించినట్లు తెలియవచ్చింది. చిరు వర్గానికి చెందిన నేతలు కూడా తమ నేతకే పిసిసి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయమై కూడా ఇంకా అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.
వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తెచ్చేందుకు పిసిసి చీఫ్ పదవిని కట్టబెట్టి ఎన్నికల బాధ్యతను పూర్తిగా చిరంజీవిపై మోపాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు చిరంజీవి వర్గం కూడా సన్నద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలి ఉప ఎన్నికల్లో రెండు సీట్లలో కాంగ్రెసు గెలిచిన క్రెడిట్ను పూర్తిగా చిరంజీవి కొట్టేశారు. దాంతో చిరంజీవిని పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి వీలుంటుందనే అవగాహనకు వచ్చినట్లు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి కుర్చీ కూడా పదిలం కాదనే వార్తలు వస్తున్నాయి. పిసిసి అధ్యక్షుల మార్పు జరిగిన వెంటనే ముఖ్యమంత్రి మార్పు కూడా జరగవచ్చునని ఊహాగానాలు వినవస్తున్నాయి. ఏది ఏమైనా ముందు పిసిసి అధ్యక్షుని మార్పు ఖాయమని పార్టీ వర్గాల తెలుస్తోంది. అలాగే తెలంగాణపై కూడా పక్షం రోజుల్లోనే పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మంత్రి దర్మాన ప్రసాదరావు రాజీనామాపై నేడో, రేపో అధిష్ఠానం ఒక అంతిమ నిర్ణయం తీసుకునే అవకాశముంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను పదవుల నుంచి తప్పించాలని సొంత పార్టీకి చెందిన కొందరు నేతలు అధిష్టానానికి ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. వీటన్నిటి దృష్ట్యా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాడి తప్పుతుందని భావించిన హైకమాండ్ ప్రక్షాళన చేయడానికి నిర్ణయించుకుంది. కాగా రాష్ట్రానికి చెందిన నేతలంతా ఇప్పుడు ఢిల్లీలో మకాం వేశారు. ఎవరికి వారు ఢిల్లీలో పెద్దలను కులుసుకుంటున్నారు.