మున్నాబాయ్కి శిక్షను ఖరారు చేయండి: సిబిఐ
అక్రమంగా 9 ఎంఎం పిస్టల్, ఎకె - 56 రైఫిల్ కలిగి ఉన్నందుకు ఆయనను 2007లో ఉగ్రవాద, విధ్వంసకర కార్యకలాపాల చట్టం ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆయనకు ఆరేళ్ల జైలు శిక్ష కూడా పడింది. అమలులో లేని టాడా చట్టం కేసులోని తీవ్రమైన ఆరోపణల నుంచి ఆయనను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దీన్ని సిబిఐ సవాల్ చేయలేదు. తనకు విధించిన ఆరేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయుధాల చట్టం కింద కింది కోర్టు సంజయ్ దత్కు విధించిన ఆరేళ్ల జైలు శిక్షను ఖరారు చేయాలని సిబిఐ సుప్రీంకోర్టును కోరింది. టాడా చట్టాన్ని ఆయనపై తిరిగి ప్రయోగించాలని మాత్రం కోరలేదు.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సంజయ్ దత్ మిత్రుడా అని సుప్రీంకోర్టు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తరఫు న్యాయవాదిని ఇటీవల విచారణ సందర్భంగా అడిగింది. సంజయ్ దత్ దాఖలు చేసిన అపీల్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆ ప్రశ్న వేసింది. ఒప్పుకోలు వాంగ్మూలంలో సంజయ్ దత్ దావూద్ ఇబ్రహీం ఇచ్చిన డిన్నర్కు తన క్లయింట్ హాజరయ్యారని సంజయ్ దత్ తరఫు న్యాయవాది హరీష్ సాల్వే చెప్పారు.దావూద్తో స్నేహం గురించి చెప్తున్నారా అని సాల్వేను సుప్రీంకోర్టు అడిగింది.
దుబాయ్లో దావూద్ ఇబ్రహీం తన నివాసంలో ఇచ్చిన విందుకు సంజయ్ దత్ హాజరయ్యారని, అయితే దావూద్తో మాత్రం సంబంధం లేదని సాల్వే చెప్పారు. సంజయ్ దత్కు దావూద్ ఇబ్రహీంతో సంబంధం కేవలం సినిమా షూటింగుకు మాత్రమే పరిమితమని చెప్పదలుచుకున్నారా అని సుప్రీంకోర్టు వెంటనే సాల్వేను అడిగింది. ముంబై పేలుళ్లతో సంజయ్ దత్కు సంబంధం లేదని, ఈ వాంగ్మూలాన్ని ట్రయల్ కోర్టు అంగీకరించిందని హరీష్ సాల్వే చెప్పారు.
బాబ్రీ మసీదు పేల్చివేత తర్వాత బెదిరింపు కాల్స్ తన కుటుంబానికి వస్తుండడంతో సంజయ్ దత్కు మూడు రైఫిళ్లు ఇచ్చారని, తనకు ఇచ్చిన రైఫిళ్లలో రెండింటిని, గ్రెనేడ్స్ను వెంటనే సంజయ్ దత్ తిరిగి ఇచ్చేశారని ఆయన చెప్పారు. మూడో రైఫిల్ను కూడా నాశనం చేయడానికి ఇచ్చాడని ఆయన చెప్పారు. సంజయ్ దత్ నివాసం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకోలేదని ఆయన చెప్పారు. పేలుళ్లకు ముందు నుంచే సంజయ్ దత్ వద్ద పిస్టల్ ఉందని ఆయన చెప్పారు.