వైయస్ జగన్ను ఎందుకు జైల్లో పెట్టారు: ఉప్పునూతల
చనిపోయిన మనిషిపై విమర్శలు తగవని ఆయన వైయస్ రాజశేఖర రెడ్డిపై వస్తున్న విమర్శలపై ప్రతిస్పందిస్తూ అన్నారు. బతికి ఉన్నప్పుడు దేవుడిగా కనిపించిన వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత దుర్మార్గుడు అయ్యారా అని ఆయన అడిగారు. కాంగ్రెసులో సీనియర్లకు ఊపిరాడని పరిస్థితి ఉందని ఆయన అన్నారు. పదవి ఉంటుందో, ఊడుతుందో తెలియని అయోమయంలో కాంగ్రెసు నాయకులు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. ఏం చూసి కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో సామాన్యుడు బతికే పరిస్థితి లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకులకు ప్రజా సంక్షేమం పట్టడం లేదని, పదవులను కాపాడుకోవడానికే సమయం అంతా వెచ్చిస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ బతుకుతుందా, లేదా అనే పరిస్థితి ఇప్పుడు ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు సమస్య తీవ్రంగా ఉందని ఆయన అన్నారు.
ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆయన గురువారంనాడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పాలక మండలి సభ్యుడు వైవీ సుబ్బారెడ్డితో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తాను వైయస్సార్ కాంగ్రెసులో చేరుతున్నట్లు ఉప్పునూతల నేడో రేపో ప్రకటించే అవకాశం ఉంది.