ఎన్టీఆర్ విగ్రహం: చంద్రబాబుపై యార్లగడ్డ విసుర్లు
లోకసభ స్పీకర్గా బాలయోగి ఉన్న సమయంలో విగ్రహాల స్థాపనకు అనుమతి లభించినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించలేదని ఆయన విమర్శించారు. ఎన్టీ రామారావు విగ్రహాన్ని పార్లమెంటు ఆవరణలో నెలకొల్పడం చంద్రబాబుకు ఇష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
పార్లమెంటు ఆవరణలో ఎన్టీ రామరావు విగ్రహాన్ని స్థాపించాలని చంద్రబాబు ఆ తర్వాత లేఖలు కూడా రాయలేదని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి పలుమార్లు లేఖలు రాసినట్లు ఆయన తెలిపారు. తనకు రాజకీయ ఉద్దేశాలు లేవని ఆయన అన్నారు. ఎన్టీ రామరావు విగ్రహం పార్లమెంటులో ఉండాలన్నదే తన ఉద్దేశమని ఆయన అన్నారు.
ఎన్టీ రామారావు విగ్రహ స్థాపనపై లోకసభకు చంద్రబాబు నుంచి ఒక లేఖ కూడా లేదని ఆయన అన్నారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి భర్త, కాంగ్రెసు శానససభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు సన్నిహితులు. మొదటి నుంచి ఆయన ఎన్టీ రామరావుకు సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఎన్టీ రామారావు నుంచి అధికార మార్పిడి జరిగిన తర్వాత ఆయన దగ్గుబాటి వెంట ఉన్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు.