వర్షాల కోసం సమాధి తవ్వి పుర్రెలు వెలికి: వింతఆచారం
అనంతరం ఊరిలోని వీధులన్నీ తిరిగి చందాలు సేకరించి, గునపాలు, పారలతో ఊరి బయట ఉన్న శ్మశానానికి వెళ్లారు. ఒక్కో సమాధిని తవ్వారు. ఒక్కో గోతిలోని పుర్రెను, ఎముకలను తీసి వాటిని కొత్తకుండలోని నీటితో, కల్లుతో కడిగారు. సాయంత్రం దాకా ఈ తవ్వకాల కార్యక్రమం యథేచ్ఛగా జరిగింది. ఇన్నాళ్లూ సమాధి లోపల ఉన్న కంకాళాలు... ఇప్పుడు బయటికి వచ్చి పోగులుగా పడ్డాయి. ఇలా చేస్తే నాలుగైదు రోజులలో భారీ వర్షం వస్తుంది.
ఈ వర్షం ధాటికి ఇప్పుడు తవ్వి తీసిన పుర్రెలు, ఎముకలు తిరిగి గోతిలోకి వెళ్లిపోతాయని గ్రామస్తుల నమ్మకం. అయితే ఈ తవ్వకాలలో ఓ లెక్క ఉంది. బతికి ఉండగా చెడ్డ పేరు తెచ్చుకున్న వారి సమాధులను మాత్రమే తవ్వి కంకాళాలు బయటికి తీస్తారు. మంచి వారి సమాధులను మాత్రం పైపై మట్టినే తీసి శుభ్రం చేస్తారు. ఈ సమాధుల తవ్వకంపై గ్రామస్థులెవరూ అభ్యంతరం వ్యక్తం చేయకుండా, సంపూర్ణంగా సహకరించడం విశేషం.
నాలుగేళ్ల క్రితం కూడా వర్షాలు పడలేదని.. ఇలాగే సమాధులు తవ్వి పుర్రెలు, ఎముకలను శుద్ధి చేశామని... మరుసటి రోజే వర్షం పడిందని స్థానికులు తెలిపారు. వర్షాలకు సంబంధించి నందిపేటలోనే మరో నమ్మకమూ ఉంది. అది... పెళ్లి కాని పది మంది యువకులకు స్నానం చేయించి, తడిగుడ్డలతో స్థానిక ఆంజనేయ స్వామి ఆలయ ప్రవేశం చేయిస్తారు. ఆలయ ప్రాంగణంలో ధాన్యం పోసి, కుండ పెడతారు. తెలుగు కార్తెల పేర్లను పది మంది యువకులు చదువుతారు. ఏ కార్తె పేరు చదువుతుండగా కుండ కదులుతుందో, ఆ కార్తెలో మాత్రమే వర్షాలు పడతాయన్నది గ్రామస్థుల నమ్మకం. ఏ కార్తెకూ కుండ కదల్లేదంటే వర్షం రాదని వారు నమ్ముతారు.