ట్విస్ట్: ఎయిర్ హోస్టెస్ గీతికను బెదిరించిన కందా 'భార్య'
కందాతో తనకు వివాహం జరిగిందని, తమకు ఓ పాప కూడా ఉందని అంకిత చెప్పుకుంది. అంకితపై గీతికా శర్మ 2009లో కేసు పెట్టింది. ఈ సమయంలో పోలీసులు అంకితను గోవాలోని పానాజీ పోలీసులు విచారించారు. ఈ విచారణలో ఆమె ఆ విషయాన్ని అంగీకరించినట్లు బయటపడింది.
పానాజీ పోలీసుల వద్ద ఉన్న రికార్డులను ఢిల్లీ పోలీసులు పరిశీలించారు. పానాజీలోని దోనా పౌలా ప్రాంతంలో ఉన్న గీతిక ఫ్లాట్లోకి అంకితా సింగ్ దూసుకెళ్లి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ తీసుకుని వెళ్లినట్లు ఆ రికార్డులను పరిశీలించిన ఢిల్లీ పోలీసులు గుర్తించారు. కందాకు చెందిన గోవాలోని కాసినోలో ఉద్యోగం మానేయాలని కూడా తాను గీతికను బెదిరించినట్లు అంకిత పానాజీ పోలీసుల వద్ద అంగీకరించింది.
కందాకు అంకిత అనే పేరు గల మహిళతో అక్రమ సంబంధం ఉందని, వారికి ఓ పాప కూడా పుట్టిందని గీతిక తన సూసైడ్ నోట్లో రాసింది. అంకిత ఆచూకీ కోసం ఢిల్లీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఫలితం కనిపించలేదు. ఆమె సింగపూర్లో స్థిరపడినట్లు సమాచారం.
గీతిక కుటుంబ సభ్యులు అంకితపై కూడా ఆరోపణలు చేశారని, తాము అంకితను కూడా ప్రశ్నిస్తామని ఢిల్లీ పోలీసులు అంటున్నారు.