జగన్ దోపిడీలో మంత్రుల భాగస్వామ్యం: ఎర్రన్నాయుడు
మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను జైలులో ఉంచిన ప్రభుత్వం ధర్మాన విషయంలో ఎందుకు వెనక్కి వెళుతున్నారని ప్రశ్నించారు. జగన్ దోపిడీలో మంత్రుల బాధ్యత ఖచ్చితంగా ఉందని, వారు చట్ట ప్రకారం శిక్షార్హులని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వెంటనే ధర్మాన ప్రసాద రాజీనామాను ఆమోదించాలని డిమాండ్ చేశారు. వారి ఇష్టం వచ్చినట్లుగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెసు కంపెనీ ఏమీ కాదని ఎద్దేవా చేశారు.
అవినీతిలో కాంగ్రెసు ప్రభుత్వానికి గిన్నిస్ రికార్డ్ వస్తుందన్నారు. ధర్మానను అరెస్టు చేయక పోవడానికి గల కారణాలు వెంటనే తెలియజేయాలన్నారు. అవినీతి మంత్రులను సమర్థిస్తే ముఖ్యమంత్రి కూడా కోర్టు ఎదుట నిల్చోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బొగ్గు కుంభకోణానికి బాధ్యత వహించాలని సూచించారు. ఈ కుంభకోణంపై కేంద్రం పార్లమెంటులో సంజాయిషీ ఇవ్వాల్సిందేనని చెప్పారు.
బిసి రిజర్వేషన్లను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజకీయం చేస్తోందని మరో నేత దేవేందర్ గౌడ్ హైదరాబాదులో అన్నారు. బిసిలపై ఆ పార్టీది కపడ ప్రేమ అని, బిసిలను జగన్ పార్టీ గందరగోళ పరుస్తోందని మండిపడ్డారు. లాటరీలో బిసిలకు టిక్కెట్లు అనేది అర్థంపర్థం లేని ప్రతిపాదన అన్నారు. బోధనా రుసుములపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.