జగన్ అవినీతికి ఎన్డీటివి రుచిమరిగింది: రేవంత్ ఆగ్రహం
ఎన్డీటివి ఇచ్చిన సర్వే రిపోర్టు రాష్ట్ర ప్రజలను తప్పు దోవ పట్టించడమే అన్నారు. సర్వేలు చేయడానికి ఇప్పుడు ఎన్నికలు ఏమీ లేవు కదా అని ఆయన ప్రశ్నించారు. అంటే ఉద్దేశ్య పూర్వకంగానే జగన్ పార్టీకి అనుకూలంగా సర్వేలు చేశారని ఆరోపించారు. ఒక పార్టీకి అనుకూలంగా సర్వేలు చేయడం సరికాదన్నారు. దీనిపై తాము గిల్డ్తో సహా సంబంధింత సంస్థలకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఒక రాజకీయ పార్టీ సంపూర్ణంగా కొమ్ముకాస్తూ రక్షించే పనిలో ఎన్డిటీవి పడిందన్నారు.
ఇప్పటికైనా ఎన్డీటివి జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకోవాలన్నారు. సర్వే రిపోర్టులు ప్రజలపై రుద్దడాన్ని తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో ఎన్డిటీవి సర్వే రిపోర్టు తప్పయిందని గుర్తి చేశారు. తెలుగుదేశం పార్టీకి 8 శాతం ఓట్లు వస్తాయని చెబితే 21 శాతం ఓట్లు వచ్చాయని, జగన్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ గెలుస్తుందని చెబితే ఓడి పోయిందని రేవంత్ గుర్తు చేశారు. ఇలాంటి తప్పుడు సర్వేలు ఇవ్వడం మానుకోవాలన్నారు. జగన్ 30 కోట్లు ఇచ్చి సర్వేలు చేయించారని ఆరోపించారు.
ఎన్టీటివిపై ఇప్పటి వరకు ఉన్న విశ్వసనీయతను, ప్రణయ్ రాయ్ పైన ఉన్న నమ్మకాన్ని వారు వమ్ము చేసుకోవద్దన్నారు. సర్వేల వల్ల ఇప్పటికిప్పుడు ఒరిగిందేమీ లేదన్నారు. కానీ ఇలా సర్వేలు చేసి ఓ పార్టీని కాపాడే ప్రయత్నాలు చేయడం మాత్రం సరికాదని రేవంత్ రెడ్డి ఎన్డిటీవికి హితవు పలికారు. వైయస్సార్ కాంగ్రెసు, సాక్షి పత్రికతో కలిసి ఎన్డిటీవి పని చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. సాక్షి, ఎన్డిటివి యాజమాన్యాల మధ్య అంతర్గత ఒప్పందం ఉందని అనుమానాలు వ్యక్తం చేసారు.