బైరెడ్డి సీమ చిచ్చుపై వసంత నాగేశ్వర రావు ఫైర్
తెలంగాణా ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ప్రత్యేక రాయలసీమ పేరుతో బైరెడ్డి చేస్తున్న ఆందోళన సమైక్యవాదానికి అండగా నిలుస్తుందన్నారు.ఆంధ్రా పాలకుల వల్ల రాయలసీమ అభివృద్ధి కాలేదని బైరెడ్డి ఆరోపించడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. రాష్టానికి ఎక్కువ మంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచే అయ్యారని గుర్తు చేశారు.
ఆంధ్రా ప్రజలను నయవంచకులుగా చిత్రీకరిస్తూ మాట్లాడడం బైరెడ్డి మానుకోవాలన్నారు. రాష్ట్రాన్ని కోరుకొనే హక్కు ఎవరికైనా ఉంటుందని, అందుకోసం ఇతర ప్రాంతాల ప్రజల మనోభావాలు దెబ్బతీయడం సరికాదన్నారు. ఇకపై ఏ ప్రాంత నాయకులైనా ఆంధ్రా ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడితే సహించేది లేదన్నారు.
మంచితనం, గౌరవ భావాలను ఇచ్చి పుచ్చుకొనే సంస్కృతి గల ఆంధ్ర ప్రజల సహనాన్ని పరీక్షించవద్దన్నారు. తెలంగాణా, రాయలసీమ విడిపోతేనే ఆంధ్ర ప్రజలు అభివృద్ధి చెందుతారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తెలంగాణాను, అవసరమైతే రాయలసీమ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.