సాగునీటి ప్రాజెక్టులపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ
జలయజ్ఞంలో భాగంగా 86 ప్రాజెక్టులకు గాను 82 ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టి ఇంత వరకు 14 ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా 1,51,204 ఎకరాల ఆయకట్టుకు నీరందించినట్లు, 1,89,379 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించినట్లు అధికారులు సమావేశంలో చెప్పారు. మిగిలిన 68 ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయని, వీటిలో కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం 50 శాతం పూర్తయిందని వారు చెప్పారు.
ఇందులో ఆంధ్ర ప్రాంతంలో 12 ప్రాజెక్టులు, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 14 ప్రాజెక్టులను, తెలంగాణ జిల్లాల్లో 24 ప్రాజెక్టులను ప్రాధాన్యత ప్రాజెక్టులుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. వీటిని రెండేళ్ల లోపు పూర్తి చేయడానికి 11969.28 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని అధికారులు మంత్రుల దృష్టికి తెచ్చారు. ఈ 50 ప్రాధాన్యత ప్రాజెక్టులు పూర్తయితే 31 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించడంతో పాటు లక్షా 51 వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించవచ్చునని అధికారులు చెప్పారు.
2004 - 05 నుంచి 2012 -13 సంవత్సరం, 2012 జులై 31 నాటికి జలయజ్ఞు ప్రాజెక్టులకు ఆంధ్ర ప్రాంతంలో రూ. 18203.11 కోట్లను, రాయలసీమ ప్రాంతంలో రూ. 17278.79 కోట్లను, తెలంగాణ ప్రాంతంలో రూ.29837.98 కోట్లను వ్యయం చేసినట్లు అధికారులు మంత్రులకు తెలిపారు.
ప్రాజెక్టులకు సంబంధించిన బిల్లులు ఎలాంటి జాప్యం లేకుండా కాంట్రాక్టు ఏజెన్సీలకు చెల్లిస్తున్నప్పటికీ నిర్ణీత గడువు లోపల పనులు పూర్తి పట్ల కాకపోవడం పట్ల మంత్రులు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టులకు 7059.53 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా గత జులైన నాటికి రూ.6,812.29 కోట్లను వ్యయం చేసి 614593.82 ఎకరాల భూమిని సేకరించడం పట్ల మంత్రుల బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.
వచ్చే నెల 6వ తేదీన మరోమారు సమావేశం కావాలని మంత్రులు నిర్ణయించారు. వచ్చే సమావేశాల్లో ఆర్థిక శాఖాధికారులను, కాంట్రాక్టర్ల సమస్యలను చర్చించడానికి వారిని ఆహ్వానించాలని సమావేశం అభిప్రాయపడింది. సమావేశంలో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు యన్కె జోషీ, ఆదిత్యానాథ్ దాస్, అరవింద్ రెడ్డి, ఇఎన్సిలు మురళీధర్, నారాయణ రెడ్డి, వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.