ఈనాడు కార్యాలయం ఖాళీ చేయాలని కోర్టు ఆదేశం
కాగా తనది కాని స్థలాన్ని రోడ్డు విస్తరణకు ఇచ్చి, అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి అక్రమంగా మరో స్థలాన్ని పొందారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు భూ వ్యవహారం కేసును అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) దర్యాప్తు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే తొలగిపోవడంతో రామోజీ రావుపై కుట్ర, మోసం, ఫోర్జరీ, అధికార దుర్వినియోగం వంటి ఆరు సెక్షన్ల కింద ఎసిబి దర్యాప్తు కొనసాగిస్తోంది.
కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేసు దర్యాప్తు జరుగుతోందని ఎసిబి అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఎసిబిలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సిఐయూ) ఎఫ్ఐఆర్ (నంబర్ 5/2012)ను నమోదు చేసింది. సిఐయూ చీఫ్ కె సంపత్ కుమార్ నేతృత్వంలో దర్యాప్తు వేగవంతం చేశారు. రామోజీ రావును మొదటి నిందితునిగా, ఉషోదయా ఎంటర్ప్రైజెస్ ఎండి సిహెచ్ కిరణ్ రెండో నిందితునిగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
ప్రభుత్వం నుంచి స్థలాన్ని పొందడంలో రామోజీకి సహకరించిన ఐఏఎస్ అధికారులు ఎస్వీ ప్రసాద్, కెవి రావులను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఈనాడు కార్యాలయమున్న స్థలాన్ని రామోజీరావు 1974లో మంతెన ఆదిత్య ఈశ్వర కుమార కృష్ణవర్మ నుంచి లీజుకు తీసుకున్నారు. 1984-85లో ఈ స్థలంలో 289 చదరపు మీటర్లు రోడ్డు విస్తరణలో పోయింది. భూ యజమానికి ఈ సమాచారం ఇవ్వకుండా, రోడ్డు విస్తరణకు ఇచ్చిన స్థలానికి ప్రతిఫలంగా రేసపువానిపాలెం సర్వే నంబర్ 52లో 872 చదరపు మీటర్ల స్థలాన్ని రామోజీ రావు తన కుమారుడు కిరణ్ పేరిట తీసుకున్నారు.
ఈ స్థలాన్ని ఇచ్చే అధికారం లేదని తహసీల్దార్ ఇచ్చిన నివేదికను కూడా కాదని, ఉన్నతాధికారులు రామోజీ కోరిన స్థలాన్ని 1985 ఏప్రిల్ 17న ఆయనకు కట్టబెట్టారట. దీనిపై భూ యజమాని వర్మ ఎసిబి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో దర్యాప్తునకు కోర్టు ఆదేశించింది. దీనిపై రామోజీ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఇటీవల హైకోర్టు స్టేను తొలగించడంతో ఎసిబి దర్యాప్తును తిరిగి ప్రారంభించింది.