ఎన్డీటివి సర్వే: విహెచ్ నిప్పులు, జగన్ గుట్టు రట్టయింది
జాతీయ మీడియా సంస్థతో రూ.20-30 కోట్ల ఒప్పందం కుదుర్చుకోబట్టే జగన్కు జాతీయస్థాయిలో ప్రచారం లభిస్తోందని చెప్పారు. బొగ్గు కేటాయింపులపై వచ్చిన ఆరోపణల ఆధారంగా మన్మోహన్ సింగ్ సర్కారుపై దుష్ప్రచారం చేస్తున్న జాతీయ మీడియా సంస్థలు... అక్రమార్జనపరుడైన జగన్కు మద్దతు పలకడం ఏమాత్రం నైతికం కాదన్నారు. ఎన్టీటివి చేసిన సర్వే సరికాదన్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే సర్వేలు చేసి ఎవరికి మేలు చేకూర్చాలనుకున్నారని ప్రశ్నించారు.
సాక్షి టివికి ఎడిటోరియల్ సహకారం అందిస్తున్న ఎన్డీటివికి జగన్ యేటా రూ.30 కోట్లు ఇస్తున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి వివిధ ఆంగ్లపత్రికలలో వచ్చిన కథనాలు మీడియాకు విడుదల చేశారు. ఆ సంబంధంతోనే జైల్లో ఉన్న జగన్కు మద్దతుగా ఎన్డీటివి సర్వే చేసిందన్నారు. 2004లో జాతీయ మీడియా ఛానళ్లు కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని చెప్పాయని, అవి అబద్దమని తేలాయన్నారు. 2009లో కూడా అన్ని సర్వేలు బిజెపియే అని చెప్పాయని గుర్తు చేశారు.
మన్మోహన్ ప్రభుత్వంపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని, అదే జగన్ పైన ఆరోపణలతో పాటు అక్రమార్జనకు నిదర్శనంగా ఆస్తులు కూడా కనిపిస్తున్నాయని, వాటిపై ఎన్డీటివి ఎందుకు రాయటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెసును వ్యతిరేకించే పార్టీలన్నీ తమకు మిత్రులే అన్నట్లు బిజెపి వ్యవహరిస్తోందని, అలాగే కలిసి వ్యాపారం చేసేవారంతా మనవాళ్లే అన్నట్లు జాతీయ మీడియా చూస్తోందని విమర్శించారు. ఇటీవల ఉప ఎన్నికలలో జగన్ పార్టీ కేవలం సానుభూతి వల్లే గెలిచిందని, మళ్లీ పునరావృతం కావన్నారు. ఇందిర హత్య అనంతరం కాంగ్రెసు భారీ మెజార్టీతో గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు.