ఊళ్లు మారుస్తున్న50పెళ్లిళ్ల కిలాడి: పోలీసుల తంటాలు
అయితే ఈ ఫోన్ ఎక్కడి నుండి వచ్చిందని కనుగొనే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత చూస్తే ఆ ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది. పోలీసులు తన కోసం వేట ప్రారంభించారని తెలుసుకున్న షహనాజ్ ఎక్కడా స్థిర నివాసం ఏర్పర్చుకోకుండా.. ఊళ్లు మారుస్తోందట. గతంలో షహనాజ్కు ఆశ్రయమిచ్చినట్లు భావిస్తున్న స్నేహితురాళ్ల కదలకలపై పోలీసులు నిఘా పెట్టారు. ప్రస్తుతం ఇబ్బందుల దృష్ట్యా స్నేహితురాళ్లను తప్పకుండా షహనాజ్ ఆశ్రయిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఆమె మోసం చేసిన లిస్ట్ యాభై నుండి వంద వరకు ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
కాగా దాదాపు యాభై మందిని పెళ్లిళ్లు చేసుకొని వారిని షహనాజ్ మోసగించిన విషయం తెలిసిందే. ఈమె మోసం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఆమె మోసం గ్రహించిన యువకులు చెన్నై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు పోలీసులు ఫోన్లో మాట్లాడినప్పుడు షహనాజ్కు కోపమొచ్చిన విషయం తెలిసిందే. ఓ మహిళ యాభై మందిని ప్రేమించి పెళ్లాడగలదా, నా పరువును తీశారు, ఇక ఆత్మహత్యే శరణ్యమంటూ ఆవేశంతో ఊగిపోయింది. తనని ఓ యువతి మోసం చేసిందని పేర్కొంటూ నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన యువకులు ఒకే రోజున నాలుగురోజుల క్రితం నగర కమిషనరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో కేరళ కిలాడీ లేడి గుట్టు బట్టబయలైంది.
పోలీసులు పత్రికలో ప్రచురించిన ఆ యువతి ఫోటోను చూసి పలువురు యువకులు కమిషనర్ కార్యాలయానికి చేరుకోవడంతో పాటు ఆమె తమనూ మోసం చేసినట్లు పోలీసులకు తెలిపారు. యాభై మంది వరకు యువకులతో ప్రేమాటలాడి భారీ మొత్తంతో ఉడాయించిన కేరళ లేడీ నేపథ్యంపై పోలీసులు చెప్పిన వివరాల... కేరళ రాష్ట్రం కేశవపురానికి చెందిన షహనాజ్ గత పదకొండేళ్ల క్రితం సిద్ధిక్ అనే కేరళ యువకుడిని వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఓ సంతానం కూడా కలిగింది. తరచూ భర్తతో విభేదిస్తూ అతనికి దూరమైన షహనాజ్ అక్కడే తన ప్రేమ నాటకానికి తెరదీసింది. తొలుత కేరళకు చెందిన ఓ యువకుడితో ప్రేమాయణం జరిపిన సహానా అతనిని వదిలేసి చెన్నయ్ రైలేక్కెసింది. ఆ తర్వాత చెన్నైలో మోసాలకు పాల్పడింది.