టిడిపి సహా ములాయం ధర్నా: చల్లారని పార్లమెంటు
శుక్రవారం ఉదయం లోకసభ సమావేశం కాగానే విపక్ష సభ్యులు ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకున్నాయి. బొగ్గు కుంభకోణంపై చర్చకు పట్టుబట్టాయి. బొగ్గు కుంభకోణానికి బాధ్యత వహించి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ప్రధాని నైతిక బాధ్యత వహించాలంటూ ఆందోళనకు దిగాయి. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. స్పీకర్ ఎంతగా నచ్చజెప్పినప్పటికీ ప్రతిపక్షాల సభ్యులు వినలేదు. దీంతో స్పీకర్ మీరా కుమార్ లోకసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభలో ఇదే పరిస్థితి నెలకొంది.
తిరిగి సమావేశమైన తర్వాత కూడా లోకసభలో పరిస్థితి సద్దుమణగలేదు. బిజెపి సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకుని వెళ్లి నిరసన తెలిపారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో స్పీకర్ సభను సోమవారంనాటికి వాయిదా వేశారు. ఇదిలా వుంటే, కాగ్పై కాంగ్రెసు ఎదురుదాడికి దిగింది.
మరోవైపు, బొగ్గు కుంభకోణంపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు పార్లమెంటు ఆవరణలో ప్రదర్శన నిర్వహించాయి. తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, సమాజ్వాదీ పార్టీలు గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగాయి. బొగ్గు కేటాయింపులను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. బొగ్గు కేటాయింపుల్లో భారీగా అక్రమాలు జరిగాయని ములాయం సింగ్ యాదవ్ ఆరోపించారు. అవినీతికి బాధ్యులైనలవారిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. గతవారం రోజుల నుచి పార్లమెంటు సమావేశాలను నిర్వహించడంలో విఫలమైన కాంగ్రెసును, సభలను అడ్డుకుంటున్న బిజెపి తీరును ఈ పార్టీలు తప్పు పట్టాయి.