జైల్లో డబ్బు, సెల్ఫోన్లు: గాలి, సురేష్ నుండి స్వాధీనం
గురువారం తెల్లవారుజామున జైలులో జరిపిన విస్తృత తనిఖీల్లో సెల్ ఫోన్లు, డబ్బులు దొరకడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గాలి జనార్థన్రెడ్డి సోదరుడు సోమశేఖర్రెడ్డి వద్ద రూ.15 వేలు, అతని అనుచరుల వద్ద రూ.8 వేలు, రెండు సెల్ఫోన్లు లభించాయి. పాక్ ఉగ్రవాది మహ్మద్బారీ వద్ద మరో సెల్ఫోన్ దొరకడంతో భద్రతా వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. బెయిల్ డీల్ కేసులో గాలి సోమశేఖర్ రెడ్డి, కర్ణాటకలోని కంప్లి ఎమ్మెల్యే సురేష్ బాబు తదితరులు కొంతకాలంగా చర్లపల్లి జైల్లోని మానస బ్యారక్లో విచారణ ఖైదీలుగా ఉంటున్నారు.
వీరి వద్ద పెద్ద మొత్తంలో నగదు, సెల్ ఫోన్లు ఉన్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు జైళ్ల శాఖ డిజి టిపి దాస్ విస్తృత తనిఖీలకు ఆదేశించారు. దీంతో జైలు అధికారులు బుధవారం అర్థరాత్రి, గురువారం తెల్లవారుజామున రెండు దఫాలుగా సోదాలు జరిపారు. సోమశేఖర్ రెడ్డి, సురేష్ బాబులు తమ దుప్పట్లలో దాచిన నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పాపాగ్ని బ్యారక్లో ఉంటున్న ఉగ్రవాది మహ్మద్బారీ వద్ద కూడా సెల్ ఫోన్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
కాగా, తనిఖీల్లో పట్టుకున్న నగదును తమ ఇష్ట దైవమైన తిరుమల వెంకన్నకు ముడుపు కట్టి ఉంచుకున్నట్లు సోమశేఖర్ రెడ్డి చెప్పడం గమనార్హం. జైల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని పర్యవేక్షణాధికారి శ్రీనివాస్ రావు తెలిపారు. సోదా నిర్వహించిన హెడ్ వార్డర్ ఎం.పంతు, వార్డర్ విజయ రామారావులకు రూ.7,500 రివార్డు ఇవ్వనున్నట్లు చెప్పారు.