బాబుకు షాక్: జగన్ పార్టీలోకి చెంగల వెంకట్రావు
ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులే తనను ఓడించారని ఆయన విమర్శించారు. చెంగల వెంకట్రావు రాజీనామా చేయడం తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్రలో పెద్ద దెబ్బనే. అక్టోబర్ 15వ తేదీన వైయస్ విజయమ్మ సమక్షంలో తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతానని ఆయన చెప్పారు. పాయకరావుపేట ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు తనను అవమానించారని ఆయన అన్నారు.
కాగా, నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెసు సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారు. ఆయన ఈ నెల 9వ తేదీన పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారు. వైయస్ జగన్ను ఆయన జనం బలం ఉన్న నేతగా అభివర్ణించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో అందరూ లబ్ధి పొందారని, వైయస్ ప్రవేశపెట్టిన పథకాలు అన్ని వర్గాలకు మేలు చేశాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రిగా పనిచేసిన అనుభవం లేకపోవడంతో రాష్ట్రంలో పాలనా యంత్రాంగం స్తంభించిందని ఆయన అన్నారు. బీసీలకు వంద సీట్లు కాదని, అసెంబ్లీలో వంద మందిని కూర్చోబెట్టాలని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, వైయస్ విజయమ్మ ఈ నెల 6, 7 తేదీల్లో ఫీజు రీయంబర్స్మెంట్పై హైదరాబాదులో దీక్ష చేపట్టనున్నారు. ఇదే అంశంపై ఆ మధ్య ఆమె ఏలూరులో ఫీజు పోరు దీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం నీరు గారుస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్శిస్తోంది. పేద విద్యార్థుల ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని, అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లించాలని వైయస్ విజయమ్మ హైదరాబాదులో డిమాండ్ చేశారు.