బాబు హ్యాపీ: తెరపైకి తృతీయ ఫ్రంట్ రాజకీయాలు
బొగ్గు కుంభకోణంపై పార్లమెంటు స్తంభన మూడో కూటమి రాజకీయాలకు పురుడు పోసినట్లు కనిపిస్తోంది. బొగ్గు గనుల కేటాయింపులో లక్షా 76 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు కాగ నివేదిక బయట పెట్టినప్పటి నుంచి పార్లమెంట్ కార్యకలాపాలను స్థంభింప చేయడంలో బిజెపి ఒంటి చేతితో విజయం సాధించింది. బిజెపి వైఖరిని వామపక్షాలు, బిఎస్పి, ఎస్పిలు వ్యతిరేకిస్తూ వచ్చాయి. దీనిపై ప్రధాని ఇచ్చిన వివరణపై సభలో చర్చ జరిగేందుకు ప్రధాన ప్రతిపక్షం సహకరించాలని కూడా సలహా ఇచ్చాయి. ఈ విజ్ఞప్తిని బిజెపి నేతలు తిరస్కరించటంతో ఎన్డీయేతర పార్టీలను కూడకట్టుకుని పోటీ ఆందోళనకు సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ రంగంలోకి దిగటంతో ఒక్కసారిగా రాజకీయాలు సరికొత్త మలుపుతిరిగాయి.
వామపక్షాలు, తెలుగుదేశం, అన్నాడిఎంకె ప్రతినిధులతో ములాయం స్వయంగా చర్చలు ప్రారంభించారు. ములాయం సింగ్ మరో పక్క కాంగ్రెస్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. రాష్టప్రతి పదవికి ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీతో గొంతు కలిపిన ములాయం 24 గంటలు గడవక ముందే ప్లేటు ఫిరాయించారు. కాంగ్రెస్తో చేతులు కలిపి మరోవైపునుంచి బొగ్గు కుంభకోణంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు రంగం సిద్ధం చేయాలన్న ములాయం ఆలోచన వెనుక ఉన్న ఆంతర్యం అంతుపట్టటం లేదని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు.
శుక్రవారం ములాయం నేతృత్వంలో వామపక్షాలు, తెలుగుదేశం పార్లమెంటు ఆవరణలో బొగ్గు కేటాయింపులపై ధర్నా చేశాయి. సుమారు అరగంట సేపుఈ ధర్నా జరిగింది. అన్నా డిఎంకెతో పాటు మరి కొన్ని పార్టీలు తమతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నాయని ములాయం ధర్నా అనంతరం వెల్లడించారు. ‘ వామపక్షాలతో మీరు చేపట్టిన ఈ ధర్నా ఫ్రంట్ రాజకీయాలకు నాందీ ప్రస్తావనా?' అని మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు ‘ మీ ఇష్టం వచ్చినట్లు భావించుకోండని'ని బదులిచ్చారు. సిపిఎం సభ్యుడు సీతారాం ఏచూరి కూడా ఫ్రంట్ ప్రతిపాదనను తోసిపుచ్చారు. ప్రజాసమస్యలపై అంశాలవారీగా ఆందోళన చేస్తామని చెప్పారు.