మీ కేబినెట్లో జగన్ కోవర్టులు: కిరణ్కు సుధాకర్ బాబు
ఎన్నికల సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలతో ఫోన్లలో సంప్రదింపులు జరిపిన మంత్రుల కాల్ లిస్టు ఆధారంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ నేతలు కొందరు 2014 ఎన్నికలనాటికి వైయస్సార్ కాంగ్రెసులో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని.. కాంగ్రెస్ వ్యవహారాలను వైయస్సార్ కాంగ్రెసుకు చేరవేస్తూ పార్టీని అస్థిరపరచేందుకు కుట్ర పన్నారని ఆగ్రహం వెలిబుచ్చారు.
కాగా కొద్ది రోజులుగా సుధాకర్ బాబు కిరణ్ మంత్రివర్గంలో కోవర్టులు ఉన్నారని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. నెల రోజుల క్రితం పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణను కలిసిన ఆయన మంత్రివర్గంలో ఏడుగురు కోవర్టులు ఉన్నారని, వారిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. నాలుగు రోజుల క్రితం న్యూఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి కూడా కోవర్టులపై ఫిర్యాదు చేశారు.
మరోవైపు కృష్ణా డెల్టా రైతాంగానికి గొడ్డలి పెట్టువంటి జీవో 69ను జారీ చేసిన తెలుగుదేశం పార్టీ పైనే ప్రజలు తిరగబడే రోజొస్తుందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ హెచ్చరించారు. గత నెల 25న తాను విలేకరుల సమావేశంలో పేర్కొన్నట్లుగా.. ఆగస్టు 27 నుంచి నిరంతరాయంగా కృష్ణా డెల్టాకు సాగునీటి సరఫరా జరుగుతోందని లగడపాటి ఒక ప్రకటనలో వివరించారు. ఒకవైపు కృష్ణా డెల్టాకు నీరొస్తున్నా టిడిపి కుహనా రాజకీయాలకు పాల్పడుతూ రాస్తారోకోలు, ధర్నాల పేరిట ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ధర్నాలో ఆ పార్టీ కార్యకర్తలు తప్ప.. రైతులెవరూ పాలుపంచుకోవడం లేదన్నారు. కృష్ణా డెల్టా రైతాంగ సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పని చేస్తున్నాయని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం రిజర్వాయర్లలో సమృద్ధిగా నీరు లేకపోయినా .. నాగార్జున సాగర్ నుంచి సీఎం ఆదేశాల మేరకు నారుమళ్లు, నాట్ల కోసం సకాలంలో నీటిని విడుదల చేశారని గుర్తు చేశారు.