బాలకృష్ణను సిఎం అభ్యర్థిగా ప్రకటిస్తే: చెంగల వెంకట్రావు
టిడిపిలో తనకు జరుగుతున్న అవమానం భరించలేక, చంద్రబాబు వైఖరి నచ్చక పార్టీని వీడుతున్నానన్నారు. చంద్రబాబు కులం కార్డును ఉపయోగించి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం బిసి డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదని చెంగల ప్రశ్నించారు. బిసిలపై అంత ప్రేమ ఉన్నప్పుడు రాజ్యసభ సీటును బిసిలకు చెందిన యనమల రామకృష్ణుడికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే బిసి వర్గానికి చెందిన వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిని చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ వర్గీకరణను తెరపైకి తెచ్చిన చంద్రబాబు కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మాలలు టిడిపికి ఓటేయలేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసతో పొత్తు పెట్టుకుని తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇచ్చి తిరిగి సీమాంధ్ర నాయకులను రెచ్చగొట్టి సమైక్యవాదం పేరుతో ధర్నాలు, ఆందోళనా కార్యక్రమాలను ప్రోత్సహించారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు తెలంగాణ పాట పాడుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబాన్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారని, వారసుడిగా తన కుమారుడినే ప్రతిపాదిస్తున్న చంద్రబాబు, పార్టీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించడంలేదన్నారు.
చంద్రబాబును ప్రజలు రెండు పర్యాయాలు తిరస్కరించారని, ఆయన నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం పోయిందన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ బతికి బట్టకట్టాలంటే బాలకృష్ణను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ను ఎన్టీఆర్ ఆగర్భ శత్రువుగా చూశారని, అదే పార్టీతో చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని చెంగల ఆరోపించారు. కాంగ్రెస్తో చేతులు కలిపి వైయస్సార్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని, వైయస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.
ఎన్ని కుట్రలు పన్నినా జగన్ తన సచ్ఛీలతను నిరూపించుకుంటారన్నారు. 2014లో జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 220 స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి రావడం ఖాయమన్నారు. చంద్రబాబు అవలంబిస్తున్న విధానాల వల్ల పార్టీ నానాటికీ దిగజారిపోతోందన్నారు. త్వరలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు కాంగ్రెస్లో విలీనం చేయడం ఖాయమన్నారు.