కిరణ్ కుమార్ రెడ్డికి ఆరు నెలల పాటు ఢోకా లేదా?
ఇంతకు ముందు ఆయన ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని వారం రోజుల ముందు మాత్రమే ప్రకటించేవారు. తనను తప్పించడం అంత సులభం కాదని ప్రత్యర్థులకు చెప్పడమే కాకుండా తన మద్దతుదారులకు భరోసా ఇవ్వడానికి అది పనికి వస్తుందని ఆయన నమ్ముతున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల వరకు కూడా ముఖ్యమంత్రి మార్పు ఉండదని ఆయన మద్దతుదారులు చెబుతున్నా మార్పుపై ప్రచారాలు ఆగడం లేదు. దీంతో ఆయన ఆరు నెలల ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని ప్రకటించి జవాబు ఇవ్వదలుచుకున్నట్లు అర్థమవుతోంది.
ఆరు నెలల షెడ్యూల్ ప్రకారం - ముఖ్యమంత్రి కర్నూలు జిల్లాలో ఇందిరమ్మ బాటను ప్రారంభించారు. ఇదే నెలలో మహబూబ్నగర్, కృష్ణా జిల్లాలో ఇది సాగుతుంది. అక్టోబర్లో మెదక్, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది. నెలకు మూడు జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. నవంబర్లో రంగారెడ్డి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో, డిసెంబర్ నెల్లూరు, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు.
వచ్చే ఏడాది జనవరిలో విజయనగరం, గుంటూరు, కరీంనగర్ జిల్లాల్లో, ఫిబ్రవరిలో కడప, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇందిరమ్మ బాట చేపడతారు. ఇందిరమ్మ బాటలో భాగంగా ముఖ్యమంత్రి మూడు రోజుల పాటు ఆయా జిల్లాల్లోని మూరు మూల గ్రామాల్లో పర్యటిస్తారు. జులైలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెసు ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో ఆయన ఇందిరమ్మ బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.