కోల్గేట్: హైదరాబాద్ సహా పది సిటీల్లో సిబిఐ సోదాలు
మోసం చేశాయనే ఆరోపణపై ఐదు కంపెనీలపై, ప్రభుత్వాధికారులపై కేసులు నమోదు చేసినట్లు సిబిఐ అధికార వర్గాలు చెప్పారు. పది నగరాల్లోని 30 ప్రాంతాల్లో సిబిఐ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, కోల్కత్తా, పాట్నా, ధన్బాద్, నాగపూర్ నగరాల్లో సోదాలు జరుగుతున్నట్లు సిబిఐ అధికారులు చెప్పారు.
కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు సిబిఐ బొగ్గు కుంభకోణంపై మూడు నెలల పాటు ప్రాథమిక విచారణ జరిపిన సిబిఐ ఇప్పుడు కేసులు నమోదు చేసింది. మైనింగ్ పనుల్లో జాప్యంపై వివరణ ఇవ్వాలని కోరుతూ కొన్ని కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రాథమిక విచారణ సమయంలో సిబిఐకి తెలిపింది.
2005లో బొగ్గు బ్లాక్ల కేటాయింపులు పొందిన కంపెనీలు కొన్ని ఇప్పటికీ మైనింగ్ పనులను ప్రారంభించలేదని మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్పాయి. జార్ఖండ్, ఛత్తీస్గడ్, కర్ణాటక రాష్ట్రాల్లోని కొన్ని కంపెనీలు పనులు ప్రారంభించకపోగా, బొగ్గు బ్లాకులను సబ్ లీజుకు ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. 2005 - 09 మధ్య కాలంలో కోల్ బ్లాక్ల కేటాయింపులపై సిబిఐ అధికారులు ఇప్పటికే సంబంధిత ఉన్నతాధికారులను ప్రశ్నించారు.