ఎన్నికలకు సిద్ధం: గట్టు, జగన్ అరెస్ట్తో తెల్సింది.. రోజా
సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పుడే రివ్యూ పిటిషన్ ఎందుకు వేయలేదని ఆయన పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణను ప్రశ్నించారు. దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ స్ఫూర్తికి భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కలిసి బిసిలకు అన్యాయం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వానికి దమ్ముంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
కరెంట్ తీగ పవర్ పట్టుకుంటే తెలుస్తుంది... రోజా
కరెంట్ తీగ పవరేంటో పట్టుకుంటేనే తెలుస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, ప్రముఖ సినీ నటి రోజు కృష్ణా జిల్లాలో అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తే కానీ ఆయన పవర్ ఏంటో కాంగ్రెసుకు తెలిసి రాలేదని ఎద్దేవా చేశారు. కొల్లేరు వలసలకు కారణం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడేనని ఆమె విమర్శించారు. నాడు చంద్రబాబు జారీ చేసిన 120 జివో వల్లనే వలసలు జరుగుతున్నాయన్నారు. బిసిలపై బాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని, రానున్నది వైయస్ జగన్ రాజ్యమేనని ఆమె అన్నారు.
కాగా అంతకుముందు రోజు అనంతపురం జిల్లాలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోజా.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన కుర్చీని కాపాడుకునేందుకే సమయాన్ని వెచ్చిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి వాటిపై దృష్టి సారించడం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి జలయజ్ఞాన్ని పూర్తిస్థాయిలో నిర్వహించాలనే తపన ఉండేదని చెప్పారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రస్తుత ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి తన కుర్చీని కాపాడుకునేందుకు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సన్నగా ఉన్నాడులే ఏం చేస్తాడు అనుకుంటే పొరపాటేననీ, విద్యుత్ తీగ కూడా సన్నగా ఉంటుందనీ.. పట్టుకుంటే దాని పవర్ ఏంటో తెలుస్తుందని అన్నారు. వంద సీట్లు ఇవ్వడం కాదు, వంద మంది బిసిలను అసెంబ్లీకి పంపించాలని ప్రతిపాదించిన తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మని తెలుగుదేశం పార్టీ విమర్శించడం తగదన్నారు.